లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం.!వైసీపి ప్రభుత్వంపై మండిపడ్డ జనసేన.!
అమరావతి/హైదరాబాద్ : రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై ప్రకాశం జిల్లాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరమని జనసేన పార్టీ అభిప్రాయపడింది. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని, అదేమీ నేరం కాదని జనసేన స్పష్టం చేసింది. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అవుతుందని, పోలీసుల లాఠీ ఛార్జ్ తో పలువురికి గాయాలయ్యాయని, ఓ రైతుకు చేయి విరిగిందని, ఇది అత్యంత పాశవిక, ఆటవిక చర్య అని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీరికి అవసరమైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
అంతే కాకుండా ఈ యాత్ర గురించి వార్తా సేకరణ కోసం వెళ్ళిన పాత్రికేయులను సైతం పోలీసులు నియంత్రిస్తుండటం ప్రభుత్వ నియంతపోకడలకు నిదర్శనమని జనసేన పార్టీ మండిపడింది. అంతే కాకుండా మీడియా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం కూడా సమాచార హక్కును కాలరాయడమేనని పేర్కొంది. పోలీసులు రాజధాని రైతుల యాత్రపై ఆంక్షలు పెంచడం, అడ్డంకులు కల్పించడంలో అసలు ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థం అవుతూనే ఉందని జనసేన పేర్కొంది. రోడ్లను దిగ్బంధించి, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏంటని సూటిగా ప్రశ్నించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు, రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందనే అంశం ప్రతిఒక్కరికీ అర్ధం అవుతోందని జనసేన తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం నియంతృత్వ విధానాలను విడనాడాలని సూచించింది. పోలీసుల దాడిలో గాయాల పాలైనవారికి, చేయి విరిగిన రైతుకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది.