జూన్ నెలాఖరు వరకు ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడపబోమని నిర్ణయం: కారణం ఇదే
కరోనా లాక్ డౌన్ నుండి ఎప్పుడు తమకు విముక్తి కలుగుతుంది. ఎప్పుడు యధావిధిగా కార్యాకలాపాలు సాగించటానికి అవకాశం ఉంటుంది అని అందరూ తెగ ఆలోహిస్తుంటే ఎపీలోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు జూన్ నెలాఖరు వరకు బస్సు సర్వీసులు నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక వారు రవాణా శాఖకు ఈ విషయంలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఒక పక్క ఏపీ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని ఆలోచన చేస్తున్నా ప్రైవేట్ ట్రావెల్స్ జూన్ నెలాఖరు వరకు నడపబోమని వెనక్కు వెళ్ళటానికి కారణం ఏంటి అంటే..
Recommended Video
బస్సులు నడిపితే త్రైమాసిక పన్ను కట్టాల్సి ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సులు నడిపే అంశంపై ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలుఎవరూ ఊహించని విధంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని రవాణా శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఒకవేళ ఇప్పటి నుండి బస్సులు నడిపితే వారు త్రైమాసిక పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకే కరోనా లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు బస్సు సర్వీసులను నిలిపివేసిన ప్రైవేట్ ట్రావెల్స్ జూన్ నెలాఖరు వరకు బస్సులను నడపకుంటే త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందే అవకాశం వుంటుంది .
బస్సులు నడపబోమని 800 బస్సుల యజమానులు రవాణా శాఖకు దరఖాస్తు
ఒకవేళ ఇప్పటి నుండి బస్సులు నడిపితే పన్ను చెల్లించాలి . అందుకే వివిధ ట్రావెల్స్కు చెందిన దాదాపు 800 బస్సుల యజమానులు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని పన్ను మినహాయింపు పొందాయి. రాష్ట్రంలోని 800 ప్రైవేటు బస్సులు జూన్ నెలాఖరు వరకు రోడ్డెక్కేపరిస్థితి లేదు . రవాణా వాహనాలను మూడు నెలలపాటు నడపకూడదని భావిస్తే త్రైమాసిక పన్ను నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది అని సర్కార్ ఇచ్చిన వెసులుబాటును బాగా ఉపయోగించుకుంటున్నాయి .
పన్ను మినహాయింపు కోసమే ప్రైవేటు ట్రావెల్స్ నిర్ణయం
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పన్ను మినహాయింపు కావాలంటే మార్చిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అయితే కరోనా వ్యాప్తిని అరికట్టటం కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా ఆగిపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మార్చిలోనే ఈ త్రైమాసికం బస్సులు నడపబోమంటూ రవాణా శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా మరో 400కు పైగా బస్సుల యాజమాన్యాలు జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకుని త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి. క్వార్టర్లీ పన్ను మినహాయింపు కోసం ప్రైవేట్ ట్రావెల్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి.