రాజధానిపై తుది నిర్ణయం ..విశాఖలో 27న క్యాబినెట్ భేటీ ... జగన్ ప్లాన్ ఇదే
ఈ నెల 27 న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశం విశాఖ వేదికగా జరగనుందా ? విశాఖలో మంత్రి మండలి సమావేశం నిర్వహించటానికి గల కారణాలు ఏంటి ? ఏపీలో మూడు రాజ్దానులపై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న వేళ సీఎం జగన్ వైజాగ్ లో కీలక భేటీ పెట్టటానికి కారణం ఏంటి? రాజధానిపై కీలక నిర్ణయం విశాఖ వేదికగా చెయ్యనున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఏడో రోజు ఉధృతంగా రాజధాని రైతుల పోరాటం: అర్ధనగ్న ప్రదర్శనలు, ర్యాలీలతో నిరసనల హోరు
ఏపీలో మూడు రాజధానుల రగడ ... రాజకీయ వర్గాల మిశ్రమ స్పందన
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది . సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం జగన్ చేసిన ప్రకటనపై మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే అని, రాజధాని రైతులకు బాసటగా పోరాడుతుంటే, జనసేన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ ఓకే కానీ రాజధాని వికేంద్రీకరణ అవసరం లేదని వాదన వినిపిస్తున్నారు . రాజకీయ వర్గాలు మిశ్రమ స్పందన వినిపిస్తున్న తరుణంలో రాజధాని విషయంలో సీయం జగన్ మంత్రివర్గ భేటీ నిర్వహించి తుది ప్రకటన చెయ్యాలని భావిస్తున్నారు.
రాజధానిపై తుది నిర్ణయం తీసుకోటానికి మంత్రి మండలి భేటీ
అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన, ఆ తరువాత జీఎన్ రావు కమిటీ నివేదికతో విషయం పూర్తిగా ఏపీ వాసులకు తేటతెల్లమైంది. ఇక సదరు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుందని మంత్రి బొత్స ప్రకటించారు. అయితే 3 రాజధానుల విషయంలో జగన్ చేసిన ప్రకటనతో పాటు జిఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 27వ తేదీన మంత్రిమండలి భేటీ జరగనుంది. ఇక ఈ భేటీని వైజాగ్ లో నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
విశాఖ వేదికగా మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్న వైసీపీ సర్కార్
వైజాగ్లో నిర్వహించడానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలిసింది. మంత్రి మండలి సమావేశానికి సంబంధించి ఇప్పటికే వైజాగ్ వేదిక ఏర్పాటు జరుగుతున్నట్లుగా సమాచారం. ఎందుకంటే 3 రాజధానుల విషయంలో జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ఈ భేటీని నిర్వహిస్తే రాజధాని ప్రాంత రైతుల సెగ తగులుతుంది అన్న భావనతో సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీకి చెక్ పెట్టే వ్యూహం .. ఉత్తరాంధ్రలో నిర్వహించటం వెనుక మాస్టర్ ప్లాన్
అంతేకాదు ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్న వేళ వైజాగ్ లో నిర్వహించడం ద్వారా టిడిపికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి నాయకులు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రి మండలి భేటీ అవ్వచ్చు అని ఈ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించాలని భావిస్తున్నారని సమాచారం.
విశాఖ వేదికగా రాజధాని విషయంలో తుది ప్రకటన
అందుకే విశాఖ వేదికగా మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తుంది. విశాఖ వేదికగా సీఎం జగన్ రాజధాని పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, విశాఖలో నిర్వహించనున్న మంత్రి మండలి సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా సీఎం జగన్ విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పాలని ఉద్దేశంతోనే మంత్రి మండలి సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.