శివాలయ పునఃప్రతిష్ఠలో అపశృతి: భక్తులపై పడిన ధ్వజస్తంభం; పలువురికి గాయాలు
కాకినాడ జిల్లాలో శివాలయ పున ప్రతిష్టాపన మహోత్సవంలో అపశృతి జరిగింది. ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతున్న క్రమంలో, దానికి కట్టిన తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా ధ్వజస్తంభం అక్కడికి వచ్చిన భక్తులపై పడింది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన భక్తులను ఆసుపత్రికి తరలించారు. ఏపీ లోని కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి లో శుక్రవారం నాడు జరిగిన ఈ దుర్ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

తాడు తెగి భక్తులపై పడిన ధ్వజస్తంభం
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి గ్రామం లో మీనాక్షి సమేత శ్రీ నీల కంఠేశ్వరుని ఆలయ పున ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. దీంతో అక్కడకు స్థానిక భక్త జనం తండోపతండాలుగా వచ్చారు. అయితే స్వామివారి పునఃప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, ఆలయంలో ధ్వజస్తంభం నిలబెడుతూ ఉండగా ధ్వజస్తంభానికి ఒకవైపు కట్టి ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ధ్వజస్తంభం ఒక్కసారిగా ఒకవైపుకు ఒరిగి పోయింది. అది అక్కడే ఉన్న భక్తులపై పడింది.

శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో ఘటన
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుంది. మరికొందరు భక్తులకు గాయాలయ్యాయని సమాచారం. ఇక గాయపడిన వారందరినీ హుటాహుటిన యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో విశాఖలోని పెందుర్తి శారదా పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

గాయపడిన భక్తులను యానాం ఆస్పతికి తరలింపు
ఇక ధ్వజస్తంభం ఒక్కసారిగా భక్తుల పై పడటంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా చేశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఇక ఆ కార్యక్రమానికి వెళ్లిన ప్రముఖులతోపాటుగా, భక్తులు ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆలయ ప్రతిష్టాపనా మహోత్సవం నాడు ధ్వజ స్థంభం క్రింద పడటం అరిష్టంగాగ్రామస్తులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications