వైసీపీ ఆవిర్భావ వేడుకల కోసం క్యాడర్ సమాయాత్తం: పార్టీ పెట్టిన పదేళ్లలోనే
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి నాయకుడు సన్నాహాలు చేస్తోన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సానుకూల వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నారు.
వైసీపీ ఆవిర్భవించి.. శుక్రవారం నాటితో పదేళ్లు పూర్తవుతాయి. 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరవేయాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. అన్ని గ్రామాల స్థాయి నుంచి మండలాలు, పట్టణాలు, నగరాల వరకు అన్ని వార్డుల్లో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ముగ్గురు సీనియర్ నాయకులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురినీ మూడు ప్రాంతాల సమన్వయకులుగా నియమించినట్లు సమాచారం.
అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగురవేయడం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నివాళి అర్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలను పార్టీ నాయకులు విడుదల చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ.. ఈ పదేళ్ల కాలంలో ఎదుర్కొన్న సవాళ్లు, పాదయాత్రను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో మేనిఫెస్టోను అమలు చేసిన తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మొట్టమొదటి సారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో 80 శాతానికి పైగా పంచాయతీలను గెలుచుకోవడం వల్ల గ్రామ స్థాయిలో ప్రజలు తమ వెంటే ఉన్నారని పార్టీ నాయకులు విశ్వసిస్తోన్నారు. అలాగే- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇవే తరహా ఫలితాలు వెలువడుతాయని ఆశిస్తోన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ కావడానికి స్థానిక సంస్థలు, పంచాయతీల్లో ప్రజా ప్రతినిదుల పాలన ఏర్పడటం మరింత ఉపకరిస్తుందని భావిస్తున్నారు.