రాజధాని కేసుల వాయిదా - విచారణ కోరిన రైతులు : కోర్టు కీలక సూచనలు..!!
మూడు రాజధానుల వ్యవహారం లో దాఖలైన పిటీషన్ల పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గత నెలలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు..సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను ఉప సంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఉప సంహరణ బిల్లును అసెంబ్లీ- శాసనమండలిలో అమోదించింది. దీనికి సంబంధించి గత విచారణ సమయంలో గవర్నర్ సంతకం కాకపోవటంతో.. కోర్టుకు నివేదించేందుకు న్యాయస్థానం ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. దీంతో..గవర్నర్ ఆమోదం తెలపటంతో..ఈ కేసుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది.
అందులో మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకున్నట్లు వివరించింది. దీంతో పాటుగా అమరావతిలో మౌళిక వసతుల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలను అఫిడవిట్ లో వివరించింది. గతంలోనే సీఎం జగన్ అమరావతిలో మౌళిక వసతుల కల్పనకు ఆదేశించారని అందులో పేర్కొంది. ఇందు కోసం ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయాల రుణం తీసుకుంటున్నట్లుగా అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఇక, దీని పైన ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అటు రైతులు..ఇటు ప్రభుత్వం తరపున వాదనలు విన్నది.
పిటిషన్లపై విచారణ కొనసాగాలని రైతుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ కోరారు. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్లు దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రైతుల తరఫు న్యాయవాదుల నోట్లు సమర్పించిన అనంతరం ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 28కి వాయిదా వేసింది. ఆ రోజు నుంచి పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.