లద్ధాక్ దుర్ఘటన అత్యంత విషాదకరం.!అమరులైన జవాన్లకు వందనాలన్న పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : హిమ పర్వతాలు, అత్యంత సంక్లిష్ట వాతావరణంతో నిండి వుండే లద్ధాక్ లో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి చెందిన దుస్సంఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడడం మన దురదృష్టంగా భావిస్తున్నానన్నారు. మానవ ప్రాణాలు ఎంతో విలువయినవపి, అందులోను సైనికుల ప్రాణాలు మరెంతో అపురూపమైనవని అన్నారు. దేశం కోసం తమ సర్వ సౌఖ్యాలు విడనాడి, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలకు ఏమి తిరిగిచ్చి రుణం తీర్చుకోగలం?అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అటువంటి జవాన్లు దేశ రక్షణ కర్తవ్యంలో భాగంగా తమ శిబిరం నుంచి వాహనంలో ప్రయాణిస్తూ మార్గమధ్యలో వాహనం నదిలోకి జారిపడి ప్రాణాలు కోల్పోవడం మాటలకు అందని విషాదమన్నారు. అమరులైన వీరులకు గౌరవ వందనం అర్పిస్తున్నానని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.

అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.అమరుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు, వారి స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెక్కలు వేయకుండా ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. అమరుల కుటుంబాలకు ఏ లోటు రాకుండా చూసుకోవలసిన భాద్యత ప్రభుత్వాలతోపాటు, భారతీయులందరిపై ఉందని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసారు.












Click it and Unblock the Notifications