వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు పేరు? శ్రావణ సంధ్య దెబ్బ
కోనసీమ జిల్లాలో ఓ దళిత యువకుడి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కుమారుడి పేరు బయటకు రావడం కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ అనే యువకుడి హత్య కేసులో వైసీపీకి చెందిన మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పేరు బయటకు రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
వాలంటీర్ దుర్గాప్రసాద్ 2022 జూన్ 6వ తేదీ హత్యకు గురైనాడు. ఈ కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన వాలంటీర్ దుర్గాప్రసాద్, ధర్మేష్ ఇద్దరు స్నేహితులని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాట మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పేరు ఉందని తెలిసింది. అయితే ఈ విషయంలో విచారణ జరుగుతున్నందున నిందితుల పేర్లు బయటకు చెప్పడం కుదరదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.

ఈనెల 18వ తేదీన ధర్మేష్ ను పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. ఆ సమయంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసుతో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు సంబంధం ఉందని నిందితుడు ధర్మేష్ పోలీసులకు చెప్పాడని తెలిసింది. ప్రస్తుతం ధర్మేష్ రిమాండ్ లో ఉన్నాడు. అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులు మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పేరు ఉందని కాని, హత్య కేసుతో శ్రీకాంత్ కు సంబంధం లేదని కాని క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.
హత్యకు గురైన దుర్గాప్రసాద్ మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు సన్నిహితంగా ఉంటూ వైసీపీ కార్యక్రమాలు చూసుకునేవాడని పోలీసులు అంటున్నారు. అయితే దుర్గాప్రసాద్ ను హత్య చేయడానికి ధర్మేష్ తో పాటు మరో నలుగురి సహాయం తీసుకున్నారని, పడవలో దుర్గాప్రసాద్ ను పిలుచుకుని వెళ్లి తాడుతో అతని గొంతు బిగించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2022లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడు
ఆ సమయంలో దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు దర్యాప్తు మాత్రం పక్కన పెట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుండి దళిత సంఘాలు, హత్యకు గురైన దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత మంత్రి వాసం శెట్టి సుభాష్ చోరవ తీసుకోవడంతో వాలంటీర్ దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య డీజీపీ ద్వారకా తిరుమలరావు కలిసి తనకు న్యాయం చేయాలని మనవి చేసింది.
అనంతరం శ్రావణ సంధ్య ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పేరు బయటకు రావడం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు హత్య కేసుతో సంబంధం ఉందా, లేదా ? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications