అనంత రోడ్డు ప్రమాదంపై ప్రధాని విచారం - పరిహారం ప్రకటన : అప్రమత్తంగా ఉండాలంటూ..!!
అనంతపురం జిల్లా ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులు కర్ణాటక బళ్లారిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన వెంకటప్పనాయుడి కుమార్తె ప్రశాంతి వివాహం ఆదివారం బళ్లారిలో జరిగింది.
బంధువులంతా కలిసి కారులో వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. అనంతపురం - బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి - కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బయటకు తీయలేనంతగా మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన పొక్లెయిన్లు తెప్పించి మృత దేహాలను బయటకు తీశారు.

ప్రమాదంలో పెళ్లికుమార్తె తండ్రి వెంకటప్పనాయుడితో పాటు ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన స్వాతి, జశ్వంత్, జాహ్నవి, కణేకల్లు మండలానికి చెందిన రాధమ్మ, బొమ్మనహాళ్కు చెందిన సరస్వతి, అశోక్, బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన శివమ్మ, రాయలదొడ్డికి చెందిన సుభద్రమ్మ చనిపోయారు.
వీరిలో సరస్వతికి స్వాతి, అశోక్ సంతానం. స్వాతికి ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి జశ్వంత్, జాహ్నవి కవల పిల్లలు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో బంధువుల దుఃఖం కట్టలు తెగింది. రెండు భాగాలుగా ఛిద్రమైన జశ్వంత్ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు.

దీని పైన స్పందించిన ప్రధాని మోదీ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెంటనే జిల్లా అధికారులు చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications