రసవత్తరంగా మారిన క్రిష్ణ జిల్లా రాజకీయం..! రాధా ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు..?
హైదరాబాద్ : క్రిష్ణ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. ఏదో ఒక వార్తతో సంచలనంగా మారుతుంటుంది. అసలు ఏ కొత్త రాజకీయానికి శ్రీకారం జరగాలన్నా అది క్రిష్ణ జిల్లా నుంచే పురుడు పోసుకోసుకుంటుంది అన్నంతగా పేరు తెచ్చుకుంది ఆ జిల్లా. అదే జిల్లాలో రాజకీయ నేతలు కూడా సాహసోపేత నిర్ణయాలతో ఎవరికి అంతుచిక్కని వ్యవహారాలను నెరవుతుంటారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడతో ముందుకువెళ్తారో ఎవరికి అంతగా తెలియదు. ఇదే కోవలో వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన రంగా వర్గం కోటరీలో ఆసక్తికర రాజకీయం చోటుచేసుకుంటోంది.
క్రిష్ణ జిల్లా లో వంగవీటి రాధా భవితవ్యం ఏంటి..? వైసీపిలో ఉంటారా..? టీ గ్లాస్ పట్టుకుంటారా..?
రంగా తనయుడు రాధా రాజకీయ భవితవ్యం క్రిష్ణ జిల్లాలో విచిత్ర మలుపులు తిరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుండి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. రాధా కోరుకుంటున్న నియోజక వర్గాన్ని ఇవ్వడానికి వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి విముఖత చూపిస్తుండడంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. రాధ జనసేన పార్టీ తరుపున తాను కోరుకునే నియోజక వర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నయనే వార్తలు క్రిష్ణ జిల్లా వ్యప్తంగా వినిపిస్తున్నాయి.
రాధాను దూరం పెడుతున్న జగన్..! బెజవాడ తూర్పు గౌతంకే అంటున్న వైసీపి అదిష్టానం..!!
ఇక ఇదే క్రిష్ణ జిల్లాలో రంగా వారసుడిగా రాధా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయాడు. రంగా స్థానంలో కాపులు ఊహించిన స్థానానికి చేరలేకపోయాడు. పైగా నాలుగు పార్టీలు మారిన గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ.. ఇన్ని సందర్భాల్లో రాధా గెలిచింది కేవలం కాంగ్రెస్ హయాంలో 2004లో మాత్రమే. 2019లో వైసీపీ తరుపున విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ ఏదో స్థానంలో బరిలో దింపాలనేది వైసీపీ వ్యూహం. కానీ.. బెజవాడ తూర్పు బరిలోకి దిగాలనుకుంటున్నాడు.
గౌతం రెడ్డి పై ఆరోపణలు..! ఐనా ఆయనకే మద్దత్తు పలుకుతున్న జగన్..!!
కానీ జగన్ మాత్రం.. ఆ స్థానాన్ని గౌతంరెడ్డికి కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే గౌతంరెడ్డి వంగవీటి రంగా గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అప్పుడు జగన్ గౌతంరెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ.. వైసీపీ తరపున గౌతంరెడ్డి అప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. క్రమంగా దీనిపై వైసీపీ పట్టించుకోవటం వదిలేసింది. ఇప్పుడు జనసేన రాకతో జగన్ కాపులను పూర్తిగా పక్కనబెట్టినట్టుగానే సంకేతాలు పంపుతున్నారు. రాధాకు కోరుకున్న చోట టికెట్ కేటాయించకుండా.. పక్కకు తప్పుకునేలా ఇదంతా జగన్ నడిపిస్తున్న డ్రామాగా రాధా అభిమానులు విమర్శిస్తున్నారు.
జనసైనలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్న అభిమానులు..! సంయమనం పాటిస్తున్న రాధా..!!
ఈ నేపథ్యంలో రాధా పార్టీ మారమంటూ ఆయన అభిమానులు ఒత్తిడి కూడా తెస్తున్నారు. దీనికి అనుగుణంగానే రాధా మరోసారి నాన్న రంగా వర్ధంతిని వేదికగా మలచుకున్నాడు. అయితే.. ఏ మాత్రం దాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుని ప్రత్యర్థికి గట్టిగా షాక్ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. కొందరు మాత్రం.. రాధా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరవచ్చనుకుంటున్నారు. కానీ కాపు వర్గ నేతలు మాత్రం రాధా జనసేనలోకి వస్తే.. రెండు విధాలుగా బావుంటుందనే సంకేతాలు పంపుతున్నారు. మరి రాధా ఏ దారి ఎంచుకుంటాడో వేచి చూడా ల్సిందే..!