ఏపీ ప్రభుత్వానికి టెన్షన్ తప్పింది - పరిస్థితులు అనుకూలంగా లేవంటూ..!!
ఏపీ ప్రభుత్వానికి సెప్టెంబర్ 1వ తేదీ టెన్షన్ తప్పింది. సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది. 2019 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని నాడు జగన్ హామీ ఇచ్చారు. అయితే, తాము ఇచ్చిన హామీల్లో 95 శాతం మేర ఇప్పటికే అమలు చేసామని.. అమలు చేయాల్సిన 5 శాతం హామీల్లో సీపీఎస్ విధానం కూడా ఉందంటూ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు దిశగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసింది.
ప్రభుత్వం - ఉద్యోగ సంఘాలు వ్యూహాత్మకంగా
ఇప్పటి వరకు సానుకూలంగా ఫలితం రాలేదు. ఇదే సమయం లో సీపీఎస్ కు మద్దతుగా ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1న ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. దీంతో..రాష్ట్ర వ్యాఫ్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిరసనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అటు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల ద్వారా నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే, దీని పైన కొద్ది రోజులుగా టెన్షన్ కొనసాగుతోంది. దీంతో..పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి ప్రకటించారు.
ఛలో విజయవాడ వాయిదాతో..
సెప్టెంబర్ ఒకటిన సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావద్దని ఆయన కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. గత ఏడేళ్లుగా శాంతియుతంగానే సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ఇప్పటివరకు వాటిని చేపట్టామన్నారు. అలాగే.. ఛలో విజయవాడ, మిలియన్ మార్చ్ పేరుతో నిర్వహించబోయే సభ, ర్యాలీకి కూడా పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. కానీ, పోలీసులు ఏ నిర్ణయం చెప్పలేదన్నారు. ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1న శాంతియుత ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలకు సీపీఎస్ రద్దును గుర్తు చేస్తున్నామని తెలిపారు. ప్రతీసారి పోలీసుల అనుమతి తీసుకొని నిరసనను కొనసాగిస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 11కి వాయిదా వేస్తూ
బైండోవర్ కేసులతో పాటు చాలా కేసులు మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం సెప్టెంబర్ 1న చేపట్టాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అప్పలరాజు, పార్దసారధి స్పష్టం చేశారు. అయితే, గతంలో సీఎం నివాసం ముట్టడి పైన పిలుపునిచ్చినా..దానిని విరమించుకున్నారు. సెప్టెంబర్ 11న ఛలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య చర్చల ద్వారా ఈ సమస్యపైన పరిష్కారానికి వీలుగా మరింత సమయం దొరికింది.