జగన్ పై డీఎల్ ఆగ్రహం వెనుక - 2024 లో ఏ పార్టీ నుంచో తేల్చేసారు : మంత్రుల పైనా..!!
సీనియర్ పొలిటీషియన్..మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా మైదుకూరు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నేదరుమల్లి జనార్ధన రెడ్డి..కోట్ల విజయ భాస్కర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. జగన్ వైసీపీ ఏర్పాటు చేసి..కడప ఎంపీగా పోటీ చేసిన వేళ.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. అయిదు లక్షల 45 వేల రికార్డు మెజార్టీతో జగన్ గెలుపొందారు.
2019 ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా
ఇక, 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. జగన్ మైదుకూరు ప్రచారం సమయంలో డీఎల్ మెడలో వైసీపీ కండువా కప్పారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, తాజాగా ఆయన జగన్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల తీరు పైన విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల భూములను ఎమ్మెల్యేలే బెదిరించి రాయించుకుంటున్నారంటూ ఆరోపించారు. దువ్వూరులో తమ ఎమ్మెల్యే రూ.80 లక్షల విలువ చేసే రెండు ఎకరాల భూమి రాయించుకున్నారంటూ విమర్శించారు.
జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ
రాష్ట్రం మరో 20-25 ఏళ్లు కోలుకోలేదంటూ ద్వజమెత్తారు. రాబోయే ఆదాయాన్ని, భూములను తాకట్టుపెట్టారని... డబ్బులు కట్టకపోతే వేలం వేస్తారని చెప్పుకొచ్చారు. నవరత్నాలు రాష్ట్ర ఖజానాను, రాష్ట్రాన్ని కొల్లగొడతాయనుకోలేదన్న డీల్... మితిమీరిన సంక్షేమం నష్టమని వ్యాఖ్యానించారు. తాను సైతం ఇక నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కి మద్దతుగా ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు చేసే పనులన్నింటినీ బయటపెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అసలు వెన్నెముక లేని మంత్రులు రాష్ట్రంలో ఎందుకని ప్రశ్నించారు.
మంత్రులు...సజ్జలపైనా విమర్శలు
ఎంపీ రఘురామకృష్ణ చెప్పినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు డమ్మీలు అయ్యారని ఆరోపించారు. రైతులు సమస్యలు పడుతున్నారని, కౌలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తప్పు చేసినవారు జైలుకు వెళ్లక తప్పదన్నారు. అయితే, డీఎల్ వచ్చే ఎన్నికల్లో తన పోటీ పైనా స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని, ఏ పార్టీ అన్నది చెప్పలేనని, ఎవరు టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉంటానని డీఎల్ తేల్చి చెప్పారు.
సీఆర్ రామచంద్రయ్యకు పదవి ఇవ్వటంతో
అయితే, డీఎల్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే అంచనాల్లో ఇప్పటి వరకు ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, కడప జిల్లా నుంచి మరో నేత సి.రామచంద్రయ్యకు వైసిపి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. తాను జగన్ కు మద్దతిచ్చినా..తనకు ఏ పదవి ఇవ్వకపోటం పైన డీఎల్ ఆగ్రహంతో ఉన్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. డీఎల్ టీడీపీ వైపు ప్రయత్నాలు చేసినా..అక్కడ ఇప్పటికే టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా కుటుంబాన్ని కాదని డీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. దీంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగుతానని చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో పోటీ పైనా
కానీ, ఎన్నికల నాటికి చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు.. సమీకరణాల ఆధారంగా డీఎల్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, తాజాగా డీఎల్ వ్యాఖ్యల పైన మంత్రి బాలినేని స్పందించారు. అసలు ఏ పార్టీలో ఉన్నారో..ఏ పార్టీలోకి వెళ్తారో కూడా క్లారిటీ లేని డీఎల్ చేసిన వ్యాఖ్యలకు అర్దం లేదని బాలినేని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో మాత్రం డీఎల్ తాజాగా చేస్తున్న రాజకీయ విమర్శల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.