కర్నాటక ఫలితాలపై...రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ:టీవీల ముందే జనాలు
అమరావతి:కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకరకంగా తమ సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వాటి ఫలితాల కోసం ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో దాదాపుగా అంతటి ఆసక్తిని కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చూపుతున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇందుకు వివిధ కారణాలు ఉన్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికార,ప్రతిపక్ష పార్టీలు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష జోక్యం చేసుకోవడమే ఈ విధమైన పరిస్థితి ఏర్పడటానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయానికొస్తే ఇక్కడ బిజెపి అనూహ్యంగా కాంగ్రెస్ పై స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు జెడిఎస్ కూడా ఊహించిన దానికంటే మరికొన్ని సీట్లు ఎక్కువగానే గెల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ ఇక్కడ వెనుకంజలోనూ, అధికారపీఠానికి దూరమవడం ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది.
కర్ణాటకలో తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉండటం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కర్నాటకలోని ఆయా పార్టీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్ధతు తెలియజేయడం, వ్యతిరేకించడం చేసిన నేపథ్యం ఇవన్నీ కలసి కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు బహిరంగ పిలుపునివ్వగా, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను, జేడీఎస్ అధ్యక్షులు, దేవెగౌడ కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసి ఫ్రంట్పై చర్చించడం, ఎన్నికల్లో మద్ధతు తెలియజేయడం చేశారు.
మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడి ప్రజలు...మరీ రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని జనాలను మినహాయిస్తే...కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్ తమ స్వరాష్ట్రం ఎన్నికల ఫలితాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఇంచుమించు అంతటి ప్రాధాన్యతను ఈ ఫలితాలకు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది, కారణం మిత్ర పక్షాలు, భాగస్వామ్య పార్టీలుగా ఉన్న టిడిపి-బిజెపి వైరి వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు తారాస్థాయిలో దుమ్మెత్తిపోసుకోవడంతో పాటు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఏకంగా పక్క రాష్ట్ర ఎన్నికలను ప్రాతిపదికగా భావించే పరిస్థితి కల్పించాయి.
ఎపి అధికార పార్టీ టిడిపి మరో అడుగు ముందుకేసి కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలను ప్రభావితం చేసే లక్ష్యంతో, బిజెపిని దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఆ రాష్ట్రానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా తమ బలగాలను పంపించి భారీ ఎత్తున భాజపా వ్యతిరేక ప్రచారం చేయించడం చేసింది. మరోవైపు ఎపి ప్రతిపక్ష పార్టీ వైసిపి కూడా అక్కడ బిజెపికి అనుకూలంగా ప్రచారం చేసినట్లు టిడిపినే ఆరోపిస్తుండటం గమనార్హం.
పైగా ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బిజెపి అక్కడ ఓటమి పాలైతే వెనక్కి తగ్గుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు తాము కోరిన విధంగా ప్రయోజనాలు కల్పిస్తుందనే విధంగా టిడిపి అన్యాపదేశంగా ఆ సందేశం జనాల్లోకి పంపింది. మరోవైపు అక్కడ బిజెపి గెలిస్తే ఇక్కడ టిడిపి అవినీతికి, ఆగడాలకు గట్టిగా బుద్ది చెప్పే అవకాశం లభిస్తుందన్నట్లుగా బిజెపితో పాటు ప్రతిపక్ష వైసిపి కూడా అలాంటి సంకేతాలు పంపారు.
దీంతో టిడిపి అనుకూల వర్గాలు అన్నీ బిజెపి ఘోరంగా దెబ్బతినాలని కోరుకోగా, బిజెపి అలాగే ఎపి ప్రతిపక్ష పార్టీ వైసిపి మద్దతుదారులు, టిడిపి వ్యతిరేకులు వీరంతా బిజెపి విజయాన్ని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికులపై ప్రస్తుతం ఈ మూడు పార్టీల ప్రభావం అనివార్యం కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లోనూ అత్యంత ఆసక్తికరంగా మారాయి. అందుకే మంగళవారం ఉదయం నుంచే ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కర్ణాటక ఫలితాల కోసం టివిల ముందు జనాలు వీక్షిస్తున్నదృశ్యాలు కోకొల్లలుగా కనిపించాయి.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ జేడీఎస్కు సంఘీభావం ప్రకటించడంలో వారికి లోపాయికారీ ప్రయోజనాలు ఉన్నాయని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. జేడీఎస్కు మద్ధతు తెలపడం ద్వారా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి పరోక్షంగా సహకరించడమేననేది మరి కొందరి వాదన.
ఇక తెలంగాణా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి తదితర నేతల బృందం కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసింది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఆరు జిల్లాల్లోని 48 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులు పర్యటించారు. అందుకే మంగళవారం ఫలితాల కోసం తెలంగాణా రాష్ట్రంలోనూ బిజెపి, కాంగ్రెస్ లతో పాటు టీఆర్ఎస్ మద్దతుదారులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్న పరిస్థితి.
ఇక అంతిమంగా తెలుగు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలు అతి సమీపంగా వచ్చిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలను అన్నిపార్టీలు ఒక రెఫరెండమ్గా భావిస్తున్నట్లు ఆయా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పైగా దక్షిణాది రాష్ట్రాలకు గేట్ వే లాంటి ఈ రాష్ట్రంలో బిజెపికి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఆ పార్టీ వ్యతిరేకులతో పాటు భాజపాలోనూ తీవ్ర ఉత్కంఠను రేపింది. కర్ణాటక ఎన్నికల్లో తాజా ఫలితాలు కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలకు నాంది పలుకే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.