ఏపీలో నేటి నుండి రెండో విడత రేషన్: రెడ్ జోన్లలో నేరుగా ఇంటికే
కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయినందున నెలకు రెండుసార్లు రేషన్ పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి నుంచి రెండో విడత పంపిణీ మొదలైంది . రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు ఎప్పటిలాగే ఒక్కో కుటుంబ సభ్యునికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చెయ్యనున్నారు . ఈ దఫా కందిపప్పుకు బదులుగా కార్డుకు కిలో చొప్పున శనగలు ఇస్తున్నారు .
ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం.. ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తాం : ఏపీ విద్యాశాఖామంత్రి
5 కేజీల చొప్పున బియ్యం
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత రేషన్ సరుకుల పంపిణీ నేడు ప్రారంభమైంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. అయితే ఏపీలో కేసులు ఎక్కువాగా నమోదు అవుతున్న రెడ్ జోన్ ఏరియాల్లో నేరుగా కార్డుదారుని ఇంటికే ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు. ఇక తొలి విడతగా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇచ్చారు.
ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా
ఇక తొలి విడత రేషన్ పంపిణీలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జనాలు రేషన్ కోసం పడుగాపులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు . ఇక దీని కోసం ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు.
వేలి ముద్రల ద్వారా
కార్డుదారులు తమకు ఇచ్చిన కూపన్లోని సమయాల్లోనే రేషన్ షాపుకు వచ్చి సరుకులను తీసుకు వెళ్ళాలని చెప్పటంతో అలాగే తీసుకు వెళ్లనున్నారు. ఇక లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇక వేలి ముద్రల ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదం ఉన్న కారణంగా బయోమెట్రిక్ లేకుండానే సరుకులను అందజేస్తున్నారు.