ముర్ముతో ఉపరాష్ట్రపతి వెంకయ్య భేటీ - సీఎం జగన్ మద్దతుగా నిలిచేనా..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపదీ ముర్మును ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందించారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తరువాత ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు వరుసగా ముర్ము నివాసానికి వెళ్లి అభినందించారు. ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాబోయే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో మొత్తం ఎంపీలు - ఎమ్మెల్యే ఓట్లు ముర్ముకే పోలవ్వటం పైన కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. దేశ వ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఇలా అన్ని ఓట్లు ముర్ము ఖాతాలో జమ అయ్యాయి.
వెంకయ్య నాయుడు అభినందనలు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని ముర్ము నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏ అభ్యర్ధి ధంఖడ్... విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా మార్గరేట్ అల్వా పోటీలో ఉన్నారు. వచ్చే నెల 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. వెంకయ్య నాయుడు ఆగస్టు 10వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఆయన కోసం ఢిల్లీలో ఇప్పటికే మరో ఇంటికి అధికారులు సిద్దం చేసారు. అయితే, వెంకయ్య నాయుడు పదవీ విరమణ తరువాత ఏపీకి తిరిగి వస్తారా..లేక, ఢిల్లీలోనే ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ అధినేత..ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో అన్ని ఓట్లు ఏకపక్షంగా
ద్రౌపది ముర్ము విజయం.. వైయస్ఆర్సీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా, బలహీన వర్గాల సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న గొప్ప అనుభవం, ఆమె ఎన్నికైన అత్యున్నత పదవిని అలంకరించారని ముఖ్యమంత్రి అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ కి చెందిన 22 మంది లోక్ సభ.. 9 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు ఇప్పుడు ఎవరికి దక్కనుందనేది చర్చకు కారణమవుతోంది. గిరిజన మహిళ కావటంతో రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించామని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెటు
ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిచ్చే ఛాన్స్ లేదు. దీంతో..ఈ ఎన్నికలోనూ వైసీపీ మద్దతు ఎన్డీఏ అభ్యర్ధికి ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా టీడీపీ సైతం తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మోదీ పైన రాజకీయ యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ తరహాలో తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి పోటీలో ఉండటంతో..వారికి మద్దతిచ్చే అవకాశాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఈ మూడు పార్టీలు తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.