కిడారి హత్య వెనుక వైసీపీ నేతలు...వారి సహకారంతోనే మావోయిస్టుల దుశ్చర్య:టిడిపి ఎమ్మెల్యే ఆరోపణ
విశాఖపట్నం: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు వైసీపీ నేతల సహకారంతోనే జరిగాయంటూ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో విశాఖ అర్బన్ టిడిపి అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కిడారికి 2008లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే క్వారీ అనుమతులు వచ్చాయని ఎమ్మెల్యే గణేష్ వెల్లడించారు. కిడారి పై కక్ష కట్టిన వైసిపి నేతలు...మావోయిస్టులకు సహకరించడం వల్లే ఈ హత్యలు జరిగాయని వాసుపల్లి గణేష్ చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే కిడారికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే క్వారీకీ అనుమతులు వచ్చాయన్నారు. అయితే కిడారి గత మూడునెలలుగా ఆయన క్వారీ తవ్వకాలకు దూరంగానే ఉంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ అతి నిరాడంబరంగా జీవించే వ్యక్తి అన్నారు. కాబట్టి, మైనింగ్ కారణంగా వారిని చంపాల్సిన అవసరం మావోయిస్టులకు లేదని ఎమ్మెల్యే గణేష్ వివరించారు.
కిడారి,సోమ హత్యలు రాజకీయ కక్షతోనే జరిగాయని గణేష్ ఆరోపించారు. కిడారి మావోయిస్టుల హిట్లిస్టులో ఉన్నారు...అయితే కిడారి ఒక్కరిపైనే దాడి జరిగితే తాము అనుమానించి ఉండేవాళ్లం కాదన్నారు. కానీ హిట్ లిస్టులో లేని సోమను కూడా మావోయిస్టులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా హత్యచేశారని చెప్పారు." ఖచ్చితంగా వైసీపీ మద్దతుదారుల సహకారంతో రాజకీయ కోణంలోనే ఈ హత్యలు జరిగాయి. ఈ వైపు నుంచి దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను కలిసి మేం కోరతాం"...అని వాసుపల్లి వెల్లడించారు.
ఇదిలావుండగా విశాఖపట్నం జిల్లాలోని అరకు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందంటూ శాసనసభ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన క్రమంలో నిబంధనల మేరకు అసెంబ్లీ ఈ నోటిఫికేషన్ విడుదలచేయడం జరిగింది. ఎమ్మెల్యే కిడారి మరణంతో అరకు స్థానం ఖాళీ అయిందని స్పీకర్ కోడెల ఆదేశానుసారం అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు.












Click it and Unblock the Notifications