మళ్లీ వైసీపీ ట్రాప్ లో చంద్రబాబు ? నాడు ప్రత్యేక హోదా- నేడు కుప్పం- అదే మైండ్ గేమ్
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కేంద్రంగా సాగుతున్న వైసీపీ, టీడీపీ రాజకీయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబును కుప్పానికి కట్టడి చేసేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తులు ఏపీ రాజకీయ చదరంగంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు మించి వైసీపీ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్న తీరు ఆయన రాజకీయ జీవితానికే సవాళ్లు విసిరేలా ఉంది. గతంలో ఓసారి ప్రత్యేక హోదా రూపంలో చంద్రబాబును చుట్టేసిన వైసీపీ.. ఇప్పుడు కుప్పంతో మరో సవాల్ విసురుతోంది.
జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుకు దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత మొదలైన వీరి పోరు ఇప్పుడు పతాకస్ధాయికి చేరిపోయింది. గతంలో వైఎస్ తనయుడిని తక్కువ అంచనా వేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ మాట అనేందుకు కూడా సాహసించలేని పరిస్ధితి.
ఈ పదేళ్లకు పైగా రాజకీయంలో చంద్రబాబు ఎతుల్ని చిత్తు చేస్తూ వైఎస్ జగన్ చేస్తున్న ప్రయాణం టీడీపీకి ప్రాణగండంగా మారిపోయింది. దీంతో ఒకప్పుడు రాజకీయాల్లో ఓనమాలు తెలియని నేతగా చంద్రబాబు భావించిన జగన్.. ఇప్పుడు చంద్రబాబు రాజకీయానికే పుల్ స్టాప్ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
నాడు ప్రత్యేక హోదాతో
జగన్ రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు తెలిసొచ్చిన అసలు సందర్భం టీడీపీ హయాంలో వైసీపీ సాగించిన ప్రత్యేక హోదా పోరాటమే. అప్పట్లో కేంద్రంలో ఎన్టీయే సర్కార్ లో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రారంభించిన ప్రత్యేక హోదా మైండ్ గేమ్ టీడీపీ ఉసురుతీసింది.
ఆ పార్టీని విజయవంతంగా ఎన్డీయే సర్కార్ నుంచి వేరు చేయడమే కాకుండా చంద్రబాబు మోడీ, అమిత్ షాలపై ధర్మపోరాటం చేసే వరకూ వెళ్లింది. దీంతో ఈ పోరులో తనను తాను ఎక్కువగా ఊహించుకున్న చంద్రబాబు దారుణంగా దెబ్బతినేశారు.
నేడు కుప్పం రాజకీయంతో
గతంలో ప్రత్యేక హోదా తీసుకురాలేదంటూ పోరు మొదలుపెట్టి ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ టీడీపీపై మైండ్ గేమ్ ప్రారంభించిన వైసీపీ అధినేత అందుకు తగ్గ ప్రతిఫలం అందుకున్నారు. ఇప్పుడు సరిగ్గా కుప్పం విషయంలోనూ అదే మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. కుప్పంలో పరిస్దితులు టీడీపీ చేజారిపోతున్నాయనే భయాన్ని కల్పించి తద్వారా చంద్రబాబును కుప్పం చుట్టే తిరిగేలా చేయడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు చంద్రబాబు కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అక్కడి నుంచే వైసీపీపై సవాళ్లు విసురుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్ధితులు మరింత విషమిస్తే కుప్పంలోనే పాగా వేసేందుకు కూడా చంద్రబాబు సిద్ఝం కావాల్సిన పరిస్ధితి.
జగన్ మైండ్ గేమా మజాకా?
రాజకీయాల్లో మైండ్ గేమ్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ విషయం చంద్రబాబుకూ తెలుసు, జగన్ కు అంతకన్నా ఎక్కువ తెలుసు. అయినా చంద్రబాబు ఆ మైండ్ గేమ్ ఆడటంలో విఫలమవుతుండగా.. జగన్ మాత్రం అదే అంశాన్ని అందిపుచ్చుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు కుప్పంలోనూ జరుగుతోంది అదే.
కుప్పంలో స్ధానిక పరిస్దితుల ఆధారంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమిని బూచిగా చూపి వైసీపీ అక్కడ రేపు ఎమ్మెల్యేను కూడా గెలుస్తామని బీరాలు పలుకుతుంటే చంద్రబాబు మాత్రం ఈ వాస్తవం అర్ధం చేసుకోలేక తన ఎమ్మెల్యే సీటుకు ఎసరు రాకుండా కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సొంత పార్టీ నేతలకే బహిరంగంగా వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇదంతా చూస్తూ వైసీపీ నేతలు తమలో తాము నవ్వుకుంటున్నారు.