మనుషుల్లో రెండు రకాలు...జివిఎల్ ఆ రెండో రకం:నారా లోకేష్
అమరావతి:టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. తాజాగా బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు, నారా లోకేష్ మధ్య ట్వీట్ల యుద్దం కలకలం రేపుతోంది.
లోకేష్ కేంద్ర మంత్రి దగ్గరకు ఒక బ్రోకర్ ను పంపారంటూ బిజెపి ఎంపి జివిఎల్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా ప్రతిస్పందించారు. మనుషుల్లో రెండు రకాలుంటారని, నిజాలు చెప్పేవారు ఓ రకమైతే, అబద్ధాలను నిజంగా నమ్మించేవారు రెండో రకమని... బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రెండో రకానికి చెందినవారని మంత్రి లోకేశ్ విమర్శించారు.

ఎంపి జివిఎల్ ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలు చేయడంతో మంత్రి నారా లోకేష్ కూడా అదే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎంపి జివిఎల్ ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ మొదలుపెట్టారని నారా లోకేష్ ధ్వజమెత్తారు. దమ్ముంటే మీరు నాకు ముడిపెట్టిన కేంద్రమంత్రి, బ్రోకర్ పేర్లు బయటపెట్టండంటూ ఎంపి జివిఎల్ కు సవాలు విసిరారు. అసత్యాలు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు ఒక జబ్బుగా మారిందన్నారు.
Recommended Video

ఏపీకి ఇవ్వాల్సింది ఏమీ లేదని, అంతా ఇచ్చేశామంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిందని లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ వెన్ను విరిస్తే...బిజెపి ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేసిందన్నారు. అందుకే బిజెపికి ఎపి ప్రజలు జీవితంలో మరచిపోలోని గుణపాఠం చెబుతారన్నారు. బిజెపి కి సిగ్గుండాలని మండిపడ్డారు.
ఇదిలావుండగా లోకేష్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు స్పందించారు. లోకేష్ తన ఆరోపణలపై స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారని, అంతసమయం ఎందుకోనని ఎద్దేవా చేశారు. అయితే జివిఎల్ ప్రతిస్పందనపై లోకేష్ వెంటనే ట్వీట్లు పెట్టారు. జివిఎల్ తన సవాలు చూసిన తర్వాతైనా తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి పేర్లు బయటపెడతారని వేచి చూస్తే మళ్లీ అసత్య ఆరోపణలు చేసి పారిపోయారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు.
తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే పనిలో బిజీగా ఉన్నానని తెలిపారు. శాఖాపర పనుల్లో బిజీగా ఉన్న తనకు జీవీఎల్ చేసిన అసత్య ఆరోపణలపై స్పందించడానికి 36 గంటలు పట్టిందని...మరి తాను అడిగిన పేర్లు బయటపెట్టడానికి ఖాళీగా ఉన్న జీవీఎల్కు ఇంత సమయం పట్టడం ఆశ్చర్యంగా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు. మీలో సృజనాత్మకత తగ్గిపోయిందా?...అంటూ జీవీఎల్పై లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications