పదవి శాశ్వతం కాదు, తీర్మానంతోనే టీ: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: పదవి శాశ్వతం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ గొంతు విప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు శానససభ తీర్మానం తప్పని సరి అని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగాన్ని, పద్ధతులను, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానం శానససభకు వచ్చినప్పుడు విప్ జారీ చేయబోరని, ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను శాసనసభ్యులు వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉంటుందని ఆయన అన్నారు.
తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని, 53 ఏళ్లుగా హైదరాబాదులో ఉన్నానని, తనలా ఎంతో మంది హైదరాబాదులోనే కాదు, తెలంగాణ జిల్లాల అంతటా స్థిరపడ్డారని, వారి గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం చాలా కఠినమైందని, ఒక సమస్యను పరిష్కరించబోయే పార్టీ అధిష్టానం పెద్ద సమస్యను సృష్టించిందని ఆయన అన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల పట్ల విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు తమ పార్టీపైనే కాకుండా తమపై కూడా ఆగ్రహంతో ఉన్నారని కిరణ్ రెడ్డి అన్నారు.
సమైక్యాంధ్రలోనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అది తన అభిప్రాయమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సరి కాదని తాను పార్టీ అధిష్టానానికి, కోర్ కమిటీకి, ప్రధానికి, రాష్ట్రపతికి చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యలు కూడా సమైక్యాంధ్రలోనే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తమ వైఖరులను మార్చుకుంటున్నారని, తాను అలా కాదని, తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, తాను ప్రజల కోసం నిలబడ్డానని ఆయన అన్నారు.
రాష్ట్రపతి పాలన వస్తుందని, తాను ముఖ్యమంత్రిగా తప్పుకోవాల్సి వస్తుందని మూడు నెలలుగా అంటున్నారని ఆయన అన్నారు. పదవి శాశ్వతం కాదని, ప్రజలే ముఖ్యమని ఆయన అన్నారు. తాను పక్షపాతంతో వ్యవహరించడం లేదని, సీమాంధ్ర ఆందోళనకు తాను మద్దతు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న సమస్యలకు ప్రత్యామ్నాయం చూపకుండా రాష్ట్ర విభజన చేయడం సరికాదని, హైదరాబాద్, నదీజలాలు, విద్యుత్ లాంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచి చెబుతునే ఉన్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్టీ నిర్ణయాన్ని తాను తప్పు పట్టడం లేదని, అయితే సమస్యలను పరిష్కరించకుండా ప్రత్యామ్నాయాలు చూపకుండా, అనుమానాలను తొలగించకుండా విభజన చేయడం సరి కాదని చెబుతున్నానని ఆయన అన్నారు.
ఆ సమయం రాలేదు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి ఉత్పన్నం కాలేదని, అది ఉత్పన్నమైనప్పుడు ఆలోచిస్తామని ఎఐసిసి అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి ఆర్పిఎన్ సింగ్ చెప్పారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలే హింసాత్మక నిరసనలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు.