సర్వే వెనుక.. మరో అజెండా: కేసీఆర్పై ముప్పేట దాడి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులతో పాటు తెలంగాణ విపక్ష నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. 'సర్వే' వెనుక కేసీఆర్కు మరో అజెండా ఉందని ఆరోపిస్తున్నారు. స్థానికత విషయంలో ఈ నెల 19 న తెలంగాణ ప్రాంతంలో చేపడుతున్న ‘ఇంటింటి సర్వే' దురుద్దేశపూరితమైందంటూ రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు, సిపిఎం నాయకుడు రాఘవులు మండిపడ్డారు.
కడపలో పల్లె రఘునాథరెడ్డి, విజయవాడలో కిషోర్బాబు, ఢిల్లీలో రాఘవులు తదితరులు కెసిఆర్ వ్యవహారశైలిని విమర్శించారు. ఇంటింటిసర్వే వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారు పెద్ద ఎత్తున వారు విమర్శించారు. ఒకవైపు స్థానికత అంశం, మరోవైపు విద్యార్థుల ఫీజు-రీఇంబర్స్మెంట్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అనేక మార్గాలను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 ప్రకారం విభజనలో ఎపి వాటా 58 శాతం గానూ, తెలంగాణ వాటా 42 శాతంగానూ పేర్కొంటూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దామాషానే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల విషయంలోనూ పాటిద్దామంటూ చంద్రబాబు ఒక ప్రతిపాదన చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లారు. ఈ ప్రతిపాదను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది.
ఆంధ్రప్రాంతంలో చదివే తెలంగాణ విద్యార్థులకు తమ ప్రభుత్వం (ఎపి ప్రభుత్వం) ఫీజు చెల్లిస్తుందని, అలాగే తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజు చెల్లించాలన్న ప్రతిపాదనను ఏపీ మంత్రులు గంటా, కిషోర్ బాబులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19న ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేపై రోజురోజుకు విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే వెనుక మరో అజెండా ఉందని సీపీఎం నేత రాఘవులు ఆరోపించారు. మరోవైపు, తెలంగాణ నేతలు కూడా సర్వే తీరును తప్పు పడుతున్నారు. ఒక్కరోజు సర్వే నేపథ్యంలో రోజువారీ కూలీలకు ప్రభుత్వం కూలీ చెల్లించాలని తెలంగాణ కాంగ్రెసు, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నేపథ్యంలో రోజువారి కూలీలకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. వారికి ప్రభుత్వం డబ్బులివ్వాలన్నారు.