కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి ఉంటాయన్న నమ్మకం లేదు...అందుకే నన్ను ఓడించారు: సాయికుమార్
విజయవాడ:కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ఉంటాయన్న నమ్మకం తనకు లేదని ప్రముఖ నటుడు, బీజేపీ నేత సాయికుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ అమ్మవారిని సాయికుమార్ దంపతులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ..."రాజకీయాల్లో కూడా సినిమాల మాదిరిగానే గెలుపు ఓటములు ఉంటాయి...దేశానికి మనం ఏం చేశాము అనే ఆలోచనతో నేను ఉన్నాను...ప్రజలకు నాపై ఇంకా నమ్మకం కలగలేదు...అందుకే నన్ను గెలిపించలేదు"...అని చెప్పారు. తనకు దేశభక్తి మెండుగా ఉందని...బిజెపి సిద్దాంతాన్ని నమ్మినవాడినని సాయికుమార్ చెప్పుకొచ్చారు.
సినిమాల్లో రాణించడం గురించి మాట్లాడుతూ..."నా స్వరం నాన్నగారిది, ఆయన స్పూర్తి నన్ను ఈ స్థాయిని తీసుకు వచ్చింది...పుష్కరాల సమయంలో నా గొంతుకతో సేవ చేసే భాగ్యం కలిగింది...సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులతో కలిసి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉంది...నా కుమారుడు ఆది ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు"...అని వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని సాయికుమార్ అభిప్రాయపడ్డారు. రాజకీయంగా శత్రువులు లేకపోయినా ప్రత్యర్థులు ఉంటారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని సాయికుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చినట్లు సాయికుమార్ తెలిపారు.
మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖ నటుడు సాయి కుమార్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బాగేపల్లి నియోజకవర్గం నుంచి ఆయన బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్ధి ఎస్.ఎస్ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. స్థానికేతరుడు కావడం వలనే అయన ఓటమిపాలు అయ్యాడని అక్కడ ప్రచారం జరిగింది. అయితే 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయి కుమార్ ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం గమనార్హం.
పైగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 41 వేల ఓట్ల తేడాతో గెలుపొందగా సాయి కుమార్ కు ఏకంగా నాలుగో స్థానం దక్కింది. రెండో స్థానంలో సిపిఎం, మూడో స్థానంలో జెడి ఎస్ నిలవగా, సాయికుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. పైగా ఇది సాయి కుమార్ తల్లి స్వస్థలం కావడం...ఇక్కడ తెలుగువారు ఎక్కువగా నివసిస్తున్నా..ఇవేవీ ఆయనకు లాభించక పోవడం చర్చనీయాంశంగా మారింది.