హైదరాబాద్లో గగనయానం.. వారణాసి మోడల్లో రోప్వేలు!
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే అన్ని ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు అవసరమైన ప్రతీచోట ఏర్పాటు చేయాలని భావిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మరో ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
ఆకాశ మార్గ రవాణా వ్యవస్థ అమలుకు నిర్ణయం
దేశంలోనే ప్రజా రవాణా కోసం రోప్వేను ప్రవేశపెట్టిన మొదటి నగరం అయిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి మోడల్ను ఆధారంగా తీసుకుని హైదరాబాద్లో ఆకాశ మార్గ రవాణా వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భాగ్యనగరవాసులు రోడ్డు ట్రాఫిక్ రద్దీ, వర్షాకాల సమస్యల నుంచి బయటపడి, త్వరగా, సురక్షితంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రోప్వేలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మార్గాలలోనే రోప్ వే లు
గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కి.మీ. రోప్వే, దీనిని మరింత పొడిగించి నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు సుమారు 6 కి.మీ. మేరకు విస్తరించాలని ప్రతిపాదన చేశారు. ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, రద్దీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా రోప్వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్లో కూడా 2-3 కి.మీ. దూరాన్ని కేవలం కొన్ని నిమిషాల్లో చేరేలా ప్లాన్
ఈ రోప్వేలు మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వాణిజ్య కేంద్రాలు, పర్యాటక స్థలాల వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా పని చేస్తాయి. వారణాసిలో రోడ్డు మార్గంలో గంట పట్టే ప్రయాణాన్ని రోప్వే ద్వారా 16 నిమిషాల్లో పూర్తి చేసినట్లుగానే హైదరాబాద్లో కూడా 2-3 కి.మీ. దూరాన్ని కేవలం కొన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ భారీ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) మోడల్లో అమలు చేయనున్నారు.
ట్రాఫిక్ సమస్యతో పాటు పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే నిర్ణయం
దీంతో ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే ప్రైవేటు ఆస్తుల మీదుగా రోప్వే వెళ్లే సందర్భంలో భూస్వాములకు పరిహారం అందించడానికి పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరియు రక్షణ శాఖ అనుమతుల కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ సమస్యతో పాటు పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేస్తుంది.
అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో, సామాన్యులకు అందుబాటు ధరల్లో టిక్కెట్లు
గోల్కొండ, టూంబ్స్, జూ పార్క్ వంటి ప్రదేశాలను ఆకాశ మార్గంలో చూడడం ద్వారా పర్యాటకులు ఆకర్షణీయమైన అనుభవం పొందుతారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో, సామాన్యులకు అందుబాటు ధరల్లో టిక్కెట్లు అందించాలని యోచిస్తున్నారు. యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది.
త్వరలో రోప్ వే ప్రాజెక్ట్ కు డీపీఆర్
హైదరాబాద్ను ఆధునిక, స్మార్ట్ సిటీగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. రోప్వే వ్యవస్థ వచ్చిన తర్వాత నగర రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా, పర్యావరణానికి అనుకూలంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ను దేశంలోనే ఆకాశ రవాణా సదుపాయాలు కలిగిన అగ్రగామి నగరాల్లో ఒకటిగా నిలుపుతుంది. ప్రభుత్వం త్వరలో ఈ ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి అమలు దశకు తీసుకెళ్లనుంది.













Click it and Unblock the Notifications