విధిలేని పరిస్థితుల్లోనే అలా, విజయ్ మాల్యా దొంగ?, మరి విజయసాయిరెడ్డి కథేంటి?: చంద్రబాబు
అమరావతి: తొలి బడ్జెట్లోనే బీజేపీతో పేచీలకు పోయి ఉంటే.. అప్పుడే రాజకీయం మొదలుపెట్టారన్న విమర్శలు వచ్చేవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకునే ఇన్నాళ్లూ కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తూ వచ్చామని అన్నారు. టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ నాయకులు తదితరులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video


విధిలేని పరిస్థితుల్లోనే:
'తొలి బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా సరిపెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత నాలుగు బడ్జెట్లు అయిపోయినా ఏపీకి న్యాయం చేయలేదు. 29సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోవాలని వేడుకున్నాం. అయినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఎన్డీయే నుంచి తప్పుకున్నాం. విధిలేని పరిస్థితుల్లోనే పోరాటమార్గం పట్టాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

యూసీలు ఇవ్వలేదంటారా?:
ఖర్చు చేసిన నిధులకు యూసీలు(యుటిలైజేషన్ సర్టిఫికెట్) ఇవ్వలేదన్న బీజేపీ ఆరోపణల్లో నిజం లేదన్నారు చంద్రబాబు. వెనుకబడిన జిల్లాల కోసం కేటాయించిన రూ.1050కోట్లలో రూ.940కోట్లకు యూసీలిచ్చామని, అమరావతికి ఇచ్చిన రూ.1000 కోట్లకు, గుంటూరు, విజయవాడకు మంజూరు చేసిన నిధుల్లో రూ.350కోట్లకు యూసీలిచ్చామని సీఎం స్పష్టం చేశారు.

అడిగితే.. అంత కోపమా?:
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, ఇచ్చిన హామిలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నదే మా ఆకాంక్ష. కేంద్రాన్ని కూడా అదే కోరుతూ వచ్చాం. ఈ మాత్రం దానికే బీజేపీకి ఎందుకంత కోపం? ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిందే. ఇక్కడి ప్రజల సెంటిమెంట్ను గౌరవించాల్సిందేనని చంద్రబాబు అన్నారు.

నాలుగేళ్లయ్యాక ఈ మాటా?:
ఏపీకి హోదా కుదరదని చెబుతున్న కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10నిష్పత్తిలో నిధులు ఇస్తోందని చంద్రబాబు అన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే తాము ఒప్పుకున్నామని, కానీ ఆ దిశగా కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరించలేదని చెప్పారు. నాలుగేళ్లు గడిచిపోయాక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని, వీటన్నింటిని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన టీడీపీ శ్రేణులకు సూచించారు.

మాల్యాకు-విజయసాయికి తేడా ఏంటి?:
ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. విజయ్ మాల్యాకు ఆయనకు తేడా ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇద్దరూ ఆర్థిక నేరస్తులేనని, అందులో ఒకరు విదేశాలకు పారిపోగా.. విజయసాయి మాత్రం ప్రధాని కార్యాలయంలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, కానీ విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications