నా దగ్గర ‘బాంబులు’ లేవు! పులివెందుల్లో పోటీ చేయలేను: జేసీ షాకింగ్
ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు తెరతీసే అనంతపురం తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అందర్నీ షాకింగ్కు గురిచేసే వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు నా దగ్గర బాంబులు లేవు.
అమరావతి: ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు తెరతీసే అనంతపురం తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అందర్నీ షాకింగ్కు గురిచేసే వ్యాఖ్యలు చేశారు.
'ఇప్పుడు నా దగ్గర బాంబులు లేవు. పులివెందులలో పోటీ చేసేంత శక్తి లేదు' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో అక్కడకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వచ్చారు. గంటాను పులివెందులలో పోటీకి పెట్టాలని పుల్లారావు ప్రయత్నిస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి పేర్కొనగా.. జేసీ నవ్వేశారు. గంటా పులివెందులకు సరిపోరని, ఆయన పనికివచ్చే ప్రాంతాలు వేరే ఉన్నాయన్నారు.
'వారూ... వీరూ ఎందుకు... మీరే అక్కడ పోటీ చేయచ్చు కదా అంటే.. 'ఇప్పుడు బాంబుల స్టాక్ లేవు... వద్దులే' అని జేసీ చెప్పారు. 'బాంబులు అంటే నిజం బాంబులు అనుకొనేరు. బాంబులు అంటే దుడ్లు (డబ్బులు). ప్రస్తుతంలేవు. మైనస్లో ఉన్నాం. అక్కడకు వెళ్ళి పోటీకి దిగాలంటే దండిగా ఉండాలి' అని జేసీ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవడంతో అందరికీ స్పష్టత వచ్చింది.