కేసీఆర్ ఆఫర్: కష్టం... టీడీపీ, ఏపీ ఎంపీ మురళీమోహన్
హైదరాబాద్: హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను తరలించడం సాధ్యం కాని పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు.
సినీ పరిశ్రమను ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి తరలించడం సాధ్యం అయ్యే పని కాదన్నారు. హైదరాబాదులోనే సినీ పరిశ్రమను కొనసాగిస్తామని చెప్పారు. ఔట్ డోర్ షూటింగుల కోసం విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాగా, సినీ పరిశ్రమకు పెద్ద పేట వేస్తామని, తెలంగాణలో 'చిత్ర నగరి'ని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో సినీ ప్రముఖులు స్వాగతించడంతో పాటు పరిశ్రమను ఇప్పటికిప్పుడు తరలించడం సాధ్యం కాదని చెప్పడం గమనార్హం.
కాగా, తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాల కబంధహస్తాల్లో చిక్కుకుందని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం ఆరోపించారు. తెలంగాణ నిర్మాతలు, కళాకారులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారు.
సినీ సిటీ నిర్మాణానికి రెండు వేల ఎకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఫిలింనగర్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టిన భూములపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.