ఆంధ్రప్రదేశ్ అసలైన అధికార చిహ్నం:పూర్ణ కుంభం కాదు...ఘటం!;తప్పుసరిదిద్దిన ప్రభుత్వం
Recommended Video
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నం అనగానే 'పూర్ణ కుంభం' అనేది జనరల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం...కానీ నిజానికి ఆ ఆన్సర్ తప్పు!...అదేంటి?...ఎన్నో ఏళ్లుగా అందరూ అదే కరెక్టని అంటున్నారు...అనడమే కాదు...ఎన్నో పోటీల్లో ఆ జవాబుతో బహుమతులు కూడా గెల్చుకున్నాం అనుకుంటున్నారా?...
కానీ నిజంగానే ఆ సమాధానం తప్పు...ఇప్పటిదాకా ఆ తప్పును ప్రజలే కాదు...ప్రభుత్వమూ చేయడం వల్లే అదే నిజమైన జవాబుగా చలామణి అయింది. అసలు నిజానికి ఆ ప్రశ్నకు సరైన సమాధానం పూర్ణ కుంభం కాదు...పూర్ణ ఘటం. ఈ రెండింటికీ తేడా తెలియక పూర్ణ ఘటం స్థానంలో పూర్ణ కుంభాన్ని అధికారిక ముద్రణల్లోనూ వాడుతూ వస్తుండటంతో చివరకు అదే సరైందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తప్పు సరిదిద్దుకొని అసలైన అధికారిక చిహ్నం మళ్లీ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆగష్టు 15 వేడుకల్లో ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే...
ఆంధ్ర రాష్ట్రం...అధికారిక చిహ్నం
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలిసారిగా అధికారిక చిహ్నాన్ని రూపొందించేందుకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో 2500 సంవత్సరాల నాటి ‘అమరావతి' బౌద్ధస్థూపంలోని ధర్మచక్రం, పూర్ణఘటంతో ఈ చిహ్నాన్ని సృష్టించారు. దీంతోపాటు సత్యమేవ జయతే, నాలుగు సింహాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...వంటి గుర్తులు, వాక్యాలతో దీన్ని రూపొందించారు. ఆ తరువాత 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కూడా ఇదే అధికారిక చిహ్నం కొనసాగింది. అయితే...ఆ తరువాత కాలక్రమంలో ఈ అధికారిక చిహ్నం ఏ విధమైన అధికారికమైన ప్రమేయం లేకుండానే అనధికారికంగా రకరకాల మార్పులకు గురైంది.
ఆ క్రమంలో...అతిపెద్ద పొరబాటు
ఆ క్రమంలో అత్యథికులు "పూర్ణ ఘటం"ని..."పూర్ణ కుంభం"గా పొరబడటమే అధికారిక చిహ్నం విషయంలో అతిపెద్ద పొరబాటు జరగడానికి కారణమైంది. దీంతో పూర్ణ ఘటం కాస్తా పూర్ణ కుంభంగా మారి తదనుగుణంగా అందులోకి మామిడి ఆకులను చేరడానికి కారణమైంది. నిజానికి పూర్ణ ఘటానికి చుట్టూ తామరపూలు, మొగ్గలు ఉంటాయి...కానీ ఆ స్థానంలో మామిడాకులతో కూడిన పూర్ణకుంభాన్ని అధికారిక చిహ్నంలో పెట్టేశారు. ప్రముఖులకు గుడికి విచ్చేసిన సందర్భంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికేందుకు ఈ పూర్ణకుంభం ఉపయోగిస్తారు...కానీ పూర్ణఘటం అంటే అది కాదు...దీనిని ఒక అక్షయ పాత్రలాగా భావిస్తారు.
అలనాటి అధికారచిహ్నం...వివరాలు
అలానాటి అధికార చిహ్నంలో ధర్మచక్రం మధ్యలో ఉన్న ఈ పూర్ణఘటాన్ని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో అప్పటి రాష్ట్ర అధికార చిహ్నంలో జరిగిన మార్పుల గురించి అధ్యయనం చేసిన కొందరు సాంస్కృతిక నిపుణులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ లోతుగా పరిశీలించారు. ఈమని శివనాగిరెడ్డి, ఇతర చారిత్రక నిపుణులతో చర్చించారు. అసలు ఈ చిహ్నానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది, అందులో ఏముంది?...అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపించారు. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రతి హైదరాబాద్లోని పురాతత్త్వ విభాగంలో ఇది దొరికింది.
అధ్యయనం...మార్పులు
పాత అధికారిక చిహ్నంపై చేసిన అధ్యయనంలో అమరావతి స్థూపం నుంచే అధికారిక చిహ్నం తీసుకున్నారని వెల్లడయింది. అంతటితో సరిపెట్టుకోకుండా నిజమైన అమరావతి స్థూపంలో పూర్ణఘటం రూపాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్న అధికారులు లండన్ మ్యూజియం నుంచి దీనికి సంబంధించిన ఫొటోను తెప్పించారు. దాన్ని సమగ్రంగా పరిశీలించిన అధికారులు ఆ తరువాత పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి 1954 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆనాడు అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన పూర్ణఘటాన్ని తిరిగి రాష్ట్ర అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు.
ఆగష్టు 15 వేడుకల్లో...అసలైన అధికారిక చిహ్నం
అలా పాత అధికారిక చిహ్నంలో అన్ని అంశాలు అధ్యయనం చేసి ఇన్నాళ్లుగా తప్పుగా ఉపయోగిస్తున్న అధికారిక చిహ్నంలో...ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో అధికార చిహ్నం పైభాగాన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఆంగ్లంలో ఉండేది. ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు. అలా తప్పులు సరిచేసుకొని బుధవారం ఆగష్టు 15 స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలపై ఈ అధికారిక చిహ్నమే కనిపించింది.