కొత్తపల్లి గీతకు ఫోన్ బెదిరింపులు: ఫిర్యాదు
రంపచోడవరం: ఆదివాసీ సాంస్కృతిక సంక్షేమ సంఘం పేరుతో కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని విశాఖపట్నం జిల్లా అరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పోలీసులకు ఫిర్యాదుచేశారు. బుధవారం రంపచోడవరం వచ్చిన ఆమె స్థానిక ఎఎస్పీ విజయారావుకు ఫిర్యాదు అందజేశారు.
ఆదివాసీ సాంస్కృతిక సంక్షేమ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు గత రెండునెలల నుండి తనకు ఫోన్ చేసి ‘ఏజన్సీలో ఎలా తిరుగుతావో చూస్తామని' బెదిరిస్తున్నారని ఫిర్యాదు అనంతరం మీడియాతో ఆమె చెప్పారు. తాను వాల్మీకి కులానికి చెందిన దానిని కాదంటున్నారని తెలిపారు. దీనిపై కొందరు తన తండ్రి బోగస్ స్కూలు సర్ట్ఫికెట్ జతచేసి, ప్రధానమంత్రికి సైతం ఫిర్యాదు చేశారన్నారు.

అప్పట్లో తాను వాల్మీకి కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నపుడు అప్పటి రెవెన్యూ అధికారి మంగపతిరావు దరఖాస్తును కొట్టివేశారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తాను వాల్మీకినేనని తీర్పు ఇచ్చి, తనకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిందన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్న వారి నుండి తనకు ప్రాణహాని కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్థానిక ఎఎస్పీకి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరామన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. బిజెపి, తెలుగుదేశం పార్టీల ఎంపిల సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications