హైకోర్టుతో మరో పోరుకు జగన్ రెడీ-ఈసారి విఫలమైతే కష్టమే ? ధిక్కరణతో రాజ్యాంగ సంక్షోభం
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత హైకోర్టుతో అనేక విషయాల్లో సర్కార్ విభేదించింది. ముఖ్యంగా ప్రజల కోసమంటూ సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు హైకోర్టులో చెల్లుబాటు కాకుండాపోయాయి. దీంతో ఓ దశలో హైకోర్టుతో జగన్ పోరు బహిర్గతమైపోయింది కూడా. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయముూర్తి, ప్రస్తుత సీజే ఎన్వీ రమణ సాయంతో హైకోర్టు న్యాయమూర్తులు తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరుస్తున్నారని జగన్ నేరుగా ఆరోపించారు. ఇప్పుడు సరిగ్గా అదే తరహా పోరుకు జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
జడ్డీలతో జగన్ పోరు
గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వెలువడిన పలు తీర్పులు తమ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నాయన్న కారణంతో జడ్డీలతో పోరుకు సీఎం జగన్ తెరలేపారు. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ .. ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తమ ప్రభుత్వాన్ని అస్దిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏకంగా సుప్రీంకోర్టు సీజే బాబ్డేకు లేఖ రాశారు.
అంతటితో ఆగకుండా దాన్ని బహిరంగంగా విడుదల చేసి మరో సంచలనం రేపారు. చివరికి సుప్రీంకోర్టు సీజే ఈ ఆరోపణలపై విచారణ జరిపి పసలేనివిగా తేల్చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వం కోర్టులు, న్యాయమూర్తుల విషయంలో మౌనంగానే ఉంటూ వస్తోంది.
అమరావతిపై హైకోర్టు తీర్పుతో
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు .. అమరావతికే మొగ్గు చూపింది. అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తీసుకురావడం చెల్లదని, ఈ మేరకు చట్టసభల్లో (అసెంబ్లీలో) చట్టాలు చేసే అవకాశం కూడా లేదని తేల్చిచెప్పేసింది.
అంతే కాదు ఆరునెలల్లో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా సూచించింది. దీంతో అప్పటికే మూడు రాజధానుల బిల్లుల్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పు తర్వాత కొత్తగా మరో బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నెల 21న అసెంబ్లీలో కొత్త బిల్లు
గతంలో ముూడు రాజధానుల ఏర్పాటుకోసం తీసుకొచ్చిన రెండు బిల్లుల స్ధానంలో కొత్త బిల్లును తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 21న ముహుర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం జగన్ తనను కలిసిన కులసంఘాల నాయకులతో ఈ విషయం బయటపెట్టారని సమాచారం. దీంతో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల కోసం కొత్త బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవున్నట్లు అర్ధమవుతోంది.
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం విశాఖ, కర్నూలు ప్రజలకు కూడా హామీ ఇచ్చేసినందున దానిపై యూటర్న్ తీసుకునే అవకాశాలు లేవు. దీంతో మూడు రాజధానుల బిల్లుపై ముందుకే వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
మరోసారి జగన్ వర్సెస్ హైకోర్టు?
గతంలో తన ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తులు తన తీర్పులతో అస్ధిరపరుస్తున్నారని ఆరోపించిన జగన్.. ఈసారి హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం కొత్త బిల్లు తీసుకొచ్చేందుు సిద్ధమవుతున్నారు. తద్వారా హైకోర్టు తీర్పు కంటే ప్రజలకు ఇచ్చిన హామీయే ముఖ్యమన్న ధోరణి ఆయనలో వ్యక్తమవుతోంది. అయితే హైకోర్టు తీర్పును ధిక్కరించి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
రాజ్యాంగ సంక్షోభం తప్పదా?
గతంలో తన ప్రభుత్వ నిర్ణయాలను కొట్టేసిందన్న కారణంతో హైకోర్టుతో ముఖాముఖీ పోరు చేపట్టిన జగన్.. ఈసారి అమరావతి విషయంలో హైకోర్టు తీర్పును ధిక్కరించడం ద్వారా ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు రాజధానులపై హైకోర్టుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కావడం వల్లే కొత్త బిల్లుకు జగన్ రెడీ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే హైకోర్టు తీర్పును వైసీపీ ప్రభుత్వం ధిక్కరించి రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపినట్లు అవుతుందనే వాదన వినిపిస్తోంది. అలాంటి పరిస్ధితుల్లో కోర్టు తీసుకునే నిర్ణయాలు కూడా కీలకంగా మారబోతున్నాయి..