ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం?
గత నెలలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదవలేదు. రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ కు చల్లటి శుభవార్తను వినిపించింది. ఈ నెలలో బంగాళాఖాతంలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్లు తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జులై నెలలో ప్రతిచోటా జూన్ నెలకంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు అన్నదాతలకు కలిసివస్తాయని భావిస్తున్నారు.
5వ తేదీన ఏర్పడిన అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల ఐదోతేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని, ఆది, సోమవారాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.

ఈనెలలోనే మరో రెండు అల్పపీడనాలు
ఈ అల్పపీడనానికి తోడు ఈనెల 15వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడి, రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితర్వాత 23వ తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందని, అది కూడా ఏపీవైపు వస్తుందని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు ఏర్పడి అవి అల్పపీడనాలుగా మారడం జరుగుతోందని, వీటి ప్రభావంతో జులై నెలలో విస్తారంగా వర్షాలు కురియబోతున్నాయని అధికారులు చెప్పారు. అధిక వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ వానలవల్ల రైతులకు మేలు కలగనుంది.












Click it and Unblock the Notifications