ఫోన్ ట్యాపింగ్: రెండో రోజు 3 టెలికం కంపెనీలు, 11 గంటల విచారణ
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ బృందం ఎదుట మంగళవారం మూడు కంపెనీల సర్వీస్ ప్రొవైడర్లు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొంత ఇరుకున పడినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉన్నతాధికారులు సెలవు బాట పట్టడం గమనార్హం. ఓటుకు నోటు విచారణలో భాగంగా కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి సెలవుపై వెళ్లారు.
శివధర్ రెడ్డి విదేశీ పర్యటన ముందే ఖరారైనప్పటికీ కీలకమైన విచారణ సమయంలో ఆయన సెలవుల్లో వెళ్లడం గమనార్హం. తాజాగా మరో కీలక అధికారి సజ్జనార్ కూడా విదేశీయానానికి వెళ్లి వచ్చారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ హోంశాఖ కార్యదర్కి వెంకటేశం 20న సెలవుపై వెళ్లారని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు కేసులో అంతర్భాగమైన ట్యాపింగ్ దర్యాప్తులో సిట్ వేగం పెంచిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు సహా 120 మందికి పైగా ప్రజాప్రతినిధులు, అధికార్లు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ రాష్టవ్య్రాప్తంగా నమోదైన 88 కేసుల విచారణపై సిట్ విచారణ చేస్తోంది.
కేసుల్లో విచారణకు తమఎదుట హాజరుకావాలంటూ సిట్ అధికారులు దాదాపు 12 టెలికాం కంపెనీల ప్రతినిధులకు నోటీసులు జారీ చేశాయి. హైదరాబాద్లో ఎవరూ హాజరుకాకపోవటంతో సోమవారం ఆ వేదిక విజయవాడకు మారింది.
రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్థానిక భవానీపురం పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు టెలిగ్రాఫ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వీటిని సిట్ విచారిస్తోంది.
సోమవారం 11 గంటల సమయానికి నేరుగా భవానీపురం పోలీస్ స్టేషన్ భవనంలో మొదటి అంతస్తుకు చేరుకున్న సిట్ అధికారులు, రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. మీడియా ప్రతినిధులెవరినీ అనుమతించలేదు. రాత్రి 7గంటల సమయానికి ఐడియా, యూనినార్, టాటా డొకొమో, వోడాఫోన్, రిలయన్స్ ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీల ప్రతినిధులు విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది.
సిట్ సేకరించిన వివరాలు ఏమిటనేది ఎవరికీ అంతపట్టడం లేదు. సమాచారం మేరకు.. 88 పోలీస్ కేసుల్లో పేర్కొన్న దాదాపు 147మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ఫోన్లకు సంబంధించిన కాల్డేటా కాపీలను సిట్ అడిగినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి భయపడి తామడిగిన సమాచారాన్ని దాచితే భవిష్యత్తులో ఆంధ్రలో ఇబ్బందులుపడాల్సి వస్తుందంటూ సున్నితంగా హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తమ కంపెనీలు ఏవిధమైన ట్యాపింగ్కు అనుమతించబడలేదని ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారని సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ఫోన్లకు సంబంధించి ట్యాపింగ్ చేయాలంటూ లేఖలు వస్తే ఆ లేఖల కాపీలను తమకందించాలని సిట్ సూచించింది. సోమవారం నాడు వేర్వేరు సర్వీస్ ప్రొవైడర్లను సిట్ అధికారులు దాదాపు 11 గంటలపాటు విచారించారని తెలుస్తోంది.
సర్వీస్ ప్రొవైడర్లను మేమూ ప్రశ్నిస్తాం: సీఐడీ పిటిషన్
ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న సర్వీస్ ప్రొవైర్లను తాము కూడా ప్రశ్నించాల్సి ఉందని ఏపీ సీఐడీ పేర్కొంది. మత్తయ్య కేసులో నెట్ వర్క్ ప్రొవైడర్లను విచారించేందుకు తమకు అనుమతివ్వాలని సోమవారం సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేసింది.