ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్ళు.. విధ్వంసానికి బ్రాండ్అంబాసిడర్ జగన్; లోటస్ పాండ్ కూల్చివేత ఎప్పుడు?: టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేత తో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పర్వం నేటికీ కొనసాగుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదిక కూల్చివేతతో పాలనకు శ్రీకారం చుట్టారని మండిపడుతున్నారు.
ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్ళు .. జగన్ విధ్వంసపాలనపై భగ్గుమన్న లోకేష్
సరిగ్గా ఇదే రోజున మూడేళ్ల క్రితం ప్రజా వేదిక ను కూల్చివేశారని గుర్తు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ మోహన్ రెడ్డి పాలన పై నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనపై విరుచుకుపడ్డారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైయస్ జగన్ అని పేర్కొన్న లోకేష్ ప్రజావేదిక కూల్చడంతో మొదలైన విధ్వంసకాండ ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్నే దహించే స్థాయికి చేరుకుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజా సంక్షేమం కోసం కాదు, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం కోసమే అన్నట్టు సాగుతోంది విధ్వంస పాలన అని నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక ను కూల్చక ముందు, కూల్చిన తర్వాత ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన లోకేష్ జగన్ పాలనను ప్రజలకు కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
నాశనం చెయ్యటమే జగన్ లక్ష్యం : టీడీపీ ఫైర్
మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అధికారి ట్విటర్ ఖాతాలో ప్రజా వేదిక కూల్చివేత పై నిప్పులు చెరిగింది. మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా వేదికను కూల్చివేయడంతో ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం మొదలైంది అని పేర్కొంది. ప్రారంభం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం స్పష్టంగా ఉందని, నాశనం చేయడమే ఆయన లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ మండిపడింది.
సంస్థలను నాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం, మానవ హక్కులను నాశనం చేయడం, వ్యవస్థలను నాశనం చేయడం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయడం వైసిపి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.
చెరువును ఆక్రమించుకుని కట్టిన నీ లోటస్ పాండ్ ను ఎప్పుడు కూల్చుతున్నావ్ ? టీడీపీ ప్రశ్న
ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు అని పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్షలతో, అన్ని అనుమతులూ ఉన్నా, టిడిపి శ్రేణుల ఇళ్లు, ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదిక కూల్చివేతకు పాల్పడుతున్నాడు జగన్ రెడ్డి అంటూ మండిపడింది. నువ్వు చెరువును ఆక్రమించుకుని కట్టిన నీ లోటస్ పాండ్ ను ఎప్పుడు కూల్చుతున్నావ్ ? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లోటస్ పాండ్ ఇంటి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి టిడిపి విరుచుకుపడింది.