ముహూర్తం ఖరారు: టిఆర్ఎస్లోకి తుమ్మల, నేతలు!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన ఆయన తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా కూడా పని చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన గడిచిన ఎన్నికల్లో పొలిట్బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావుతో ఏర్పడిన విభేదాల కారణంగా ఓటమి చెందినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
గడిచిన ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ నామా నాగేశ్వరరావు తన అనుచరురాలైన స్వర్ణకుమారికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావటంతో తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అంతకుముందు నుంచే ఇరువురి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంలో చంద్రబాబు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, 150 మంది సర్పంచ్లు, 140 మంది ఎంపిటిసిలు, 15 మంది జడ్పీటిసిలు టిఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది.