మత్తు మందు ఇచ్చి పెద్ద పులిని పట్టుకున్నారు
కర్నూలు: గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల ప్రజలను భయపెడుతున్న పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం గ్రామ శివార్లలో గల పొదల్లో ఉండగా దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.
ఆ తర్వాత దాన్ని వాహనంలో ఆత్మకూరు రేంజ్ కార్యాలయానికి తరిలించారు. ఆ తర్వాత దాన్ని తిరుపతిలోని జంతు ప్రదర్శన శాలకు పంపించారు. పట్టుబడిన పెద్ద పులి వయస్సు 12 ఏళ్లు ఉంటుందని అంచనా. అది తీవ్రమైన ఆకలితో అలసిపోయినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
బావిలో దూకి ఆత్మహత్య
వృద్ధాప్యంలో తనను పట్టించుకునేవారు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఓ 90 ఏళ్ల వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఆరు నెలల క్రితం మరణించింది. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామంలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది.
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో శుక్రవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనాటి కాళప్ప కుమారుడు తులసి (10), మోడుబోయిన వెంకటరత్నం కుమారుడు గురుప్రసాద్ (9), స్థానిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు.
శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత వారిద్దరు కలిసి వారి ఇళ్లకు సమీపంలో గల చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ నీటితో నిండి ఉన్న గుంతలో ఈత కొట్టేందుకు ప్రయత్నించి ఇద్దరూ జారి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెతుకుతూ వచ్చారు. వారు చూసేసరికి ఇద్దరు బాలురు కూడా మరణించి కనిపించారు.