పశ్చిమగోదావరి జిల్లాలో పులిభయం; మూడు దూడల మృతితో శివారు గ్రామాల రైతుల్లో టెన్షన్
పశ్చిమగోదావరి జిల్లాలో పులుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల అటవీ ప్రాంతానికి సమీపంలోని శివారు గ్రామాల్లో వరుసగా దూడలు మృత్యువాత పడుతుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వరుసగా మూడు రోజుల్లో రెండు దూడలు మృతి చెందడంతో.. వాటిని చంపిన జంతువు పులి అని ప్రజలు అనుమానిస్తున్నారు. వరుసగా మూడు రోజులు దూడలు మృతిచెందిన ఘటనలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
వరుసగా దూడలను చంపి తింటున్న జంతువు.. పులి అని స్థానికుల భయం
వివరాల్లోకి వెళితే ఈ నెల 24వ తేదీ రాత్రి ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో ఓ రైతు పొలంలో కట్టేసిన దూడను గుర్తు తెలియని జంతువు చంపి తినేసింది. మరుసటి రోజు ఉదయం రైతు పొలానికి వెళ్లి చూడగా దూడ కళేబరం కనిపించింది. ఏదో జంతువు దాడి చేసి చంపి తిన్నట్టు ఆనవాళ్ళు కనిపించాయి. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను పోలిన జాడలు కూడా కనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ 25వ తేదీ రాత్రి గుణ్ణంపల్లి సమీపంలోని నారాయణపురం శివారులోని పొలంలో గుర్తుతెలియని జంతువు మరో దూడను చంపి మాంసాన్ని తినేసింది.
పులిలాంటి జంతువు సంచరిస్తున్న ఆనవాళ్లను గుర్తించిన రైతులు
ఉదయం పొలానికి వెళ్లిన రైతు చనిపోయిన దూడను చూసి షాక్ తిన్నాడు.ఆ కళేబరాన్ని పక్కకు లాగేసి అక్కడే వదిలేశాడు. అదే రోజు రాత్రి మళ్లీ గుర్తు తెలియని జంతువు పక్కన పడేసిన దూడలోని మరికొంత శరీరభాగాన్ని తినేసింది. దీంతో ఈ ప్రాంతంలో పులిలాంటి జంతువు సంచరిస్తున్న ఆనవాళ్లను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. పులి నుండి పశువులను, తమను కాపాడుకోవటం ఎలా అని ఆలోచనలో పడ్డారు.
అటవీ అధికారులకు సమాచారం అందించిన రైతులు
వెంటనే పులి సంచారం పై రైతులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించారని తెలుస్తుంది. పులిని గుర్తించటం కోసం అటవీ అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు పులి తిరుగుతున్న నేపధ్యంలో ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా తిరగొద్దని చెప్తున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లి పశువులను కాపాడుకోలేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ద్వారకా తిరుమల శివారు గ్రామాల్లో పులి ఆందోళన
ప్రస్తుతం పశువుల పై దాడి చేసి చంపి తింటున్న పులి, మనుషులపై కూడా ఎప్పుడు ఎలా విరుచుకు పడుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ద్వారకా తిరుమల అటవీ ప్రాంతాల్లో తరచూ పులులు సంచరిస్తూ ఉండేవని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు పులి సంచారం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇటీవల దూడలను చంపి వాటి మాంసాన్ని తినడంతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నవి పులులేనని, అధికారులు తమకు రక్షణ కల్పించాలని రైతులు వేడుకొంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా పులి దాడే అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం పులిభయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.