ప్రొద్దుటూరులో మళ్లీ టిప్పుసుల్తాన్ రచ్చ-బీజేపీ నేతల ఎంట్రీతో ఉద్రిక్తత
ఏపీలో సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదం కాకరేపుతోంది. వైసీపీ నేతలతో పాటు స్ధానిక ముస్లింల ప్రోద్భలంతో విగ్రహం ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటం ప్రొద్దుటూరులో ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
ప్రొద్దుటూరులో మళ్లీ టిప్పుసుల్తాన్ రచ్చ-బీజేపీ నేతల ఎంట్రీతో ఉద్రిక్తత#Andhrapradesh #Kadapa #Proddutur pic.twitter.com/EkEH7aMwNF
— oneindiatelugu (@oneindiatelugu) June 18, 2021
హిందువుల ఊచకోతకు కారణమైన టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ ఈ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇవాళ దానికి కొనసాగింపుగా బీజేపీ నేతలు ప్రొద్దుటూరు పర్యటనకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఉదయం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు.
పోలీసులు అడ్డుకుంటారన్న అనుమానంతో దువ్వూరు మీదుగా ప్రొద్దుటూరు చేరుకున్న బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. విష్ణును ప్రొద్దుటూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. అయితే టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు స్ధలానికి తాము వెళ్లి తీరుతామని విష్ణువర్ధన్రెడ్డి చెప్తున్నారు. తమ పర్యటనకు పోలీసులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. విష్ణుతో పాటు బీజేపీ నేతల పర్యటన సందర్భంగా ప్రొద్దుటూరు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.