వైఎస్ జగన్తో రమణ దీక్షితులు భేటీ: తిరుపతి ఉప ఎన్నిక వేళ..: పింక్ డైమండ్ ఇష్యూ
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూరకంగా కలిశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను పునర్ నియమించడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు తెలుపుకొన్నారు. శాలువ కప్పి గౌరవించారు. ఏడుకొండలవాడి తీర్థ, ప్రసాదాలను వైఎస్ జగన్కు అందజేశారు. స్వామివారి అక్షింతలు చల్లి, ఆశీర్వచనాలు పలికారు. తిరుమలేశుడిని సేవించడానికి తనకు మరోసారి అవకాశం కల్పించడం ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ పరిధిలోని తిరుపతి శ్రీగోవిందరాజ స్వామివారి దేవస్థానం, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు వెంట ఉన్నారు. తిరుమలతో పాటు టీటీడీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన 15 మంది అర్చకులకు వంశపారంపర్యాన్ని పునరుద్ధరించడం పట్ల వారు వైఎస్ జగన్కు కృతజ్ఙతలు తెలిపారు.
రమణ దీక్షితులు ఇదివరకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉద్వాసన పలికారు. 65 సంవత్సరాలు దాటిన అర్చకులందరికీ బలవంతంగా పదవీ విరమణ కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ దీన్ని వర్తింపజేస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్గా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా మధుసూదన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వ్యవస్థకు స్వస్తి పలికారు. అప్పట్లో ఈ ఉత్తర్వులు పెద్ద ఎత్తున వివాదాన్ని రేపాయి.
శ్రీవారి ఆలయానికి సంబంధించిన పింక్ డైమండ్ మాయం అయ్యిందని, శ్రీవారి పోటులో అక్రమంగా తవ్వకాలు చోటు చేసుకున్నాయంటూ రమణ దీక్షితులు ఆరోపణలు చేయడమే దీనికి కారణమైంది. ఆయన బలవంతపు పదవీ విరమణకు దారి తీసింది. ఈ విషయంపై రమణ దీక్షితులు ఒకట్రెండుసార్లు వైఎస్ జగన్ను కలిశారు. తాజాగా- రమణ దీక్షితులు సహా ఆయా ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పునరుద్ధరించింది. వారిని మళ్లీ ఇదివరకటి స్థానాల్లో నియమించింది. రెండు రోజుల కిందటే రమణ దీక్షితులు బాధ్యతలను స్వీకరించారు. మర్యాదపూరకంగా వైఎస్ జగన్ను కలిశారు.