తిరుమల: నేటి నుంచే అమల్లోకి పెరిగిన లడ్డూ ప్రసాదం ధరలు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదం పెరిగిన ధరలు గురువారం(డిసెంబర్ 21) నుంచి అమల్లోకి వచ్చాయి. లడ్డూ ధర రూ.50, కళ్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా నిర్ణయించింది. అయితే, ఈ ధరలు సిఫార్సు లేఖలపై జారీ చేసే ప్రసాదాలకు మాత్రమే వర్తిస్తాయి.
దర్శనం టికెట్పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని, సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ స్పష్టం చేసింది.
సాధారణంగా సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే పెరిగిన ధరలు చెల్లించాల్సి ఉంటుంది.
కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు తీసుకొస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ తాజా నిర్ణయంతో పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం ధరలు పెంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.