తిరుమల కిటకిట: భక్తులతో నిండిపోయిన తిరుపతి బస్టాండు; అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఇప్పటికే ఐదు రోజుల పాటు విఐపి దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని ప్రకటన చేసిన టీటీడీ రేపటి నుండి ఆదివారం వరకు విఐపి దర్శనాలను నిలిపి వేయనుంది. ఇక సాధారణ భక్తులకు దర్శనం టోకెన్లు లేకున్నా దర్శనం చేసుకోవటానికి అనుమతిస్తూ సంచలన ప్రకటన చేసింది.
క్యూలైన్ లలో తొక్కిసలాటతో టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి టీటీడీ నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో సర్వదర్శనం టోకెన్ లను జారీ చేస్తున్న క్రమంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టిటిడి సర్వ దర్శనం టోకెన్లు లేకున్నా దర్శనం చేసుకోవచ్చని భక్తులను స్వామి దర్శనానికి వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేసింది. సర్వదర్శనం టోకెన్ లకు బదులుగా ఆధార్ కార్డు ని చూపించి దర్శనానికి వెళ్లొచ్చు అని పేర్కొంది.
టోకెన్లు లేకున్నా దర్శనానికి.. మైకుల ద్వారా టీటీడీ విజిలెన్స్ అధికారుల ప్రచారం
ఎలాంటి దర్శనం టోకెన్లు లేకున్నా దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ సంచలన ప్రకటన చేసింది. ఇక ఈ విషయాన్ని మైకుల ద్వారా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తెలియజేస్తున్నారు. దర్శనం టోకెన్ ల కోసం ఎవరూ కౌంటర్ల వద్దకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో టోకెన్లు లేకుండానే దర్శనం చేసుకోవచ్చని విజిలెన్స్ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యూలైన్లలో చోటుచేసుకున్న తోపులాట నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని నేరుగా స్వామి దర్శనాన్ని కల్పిస్తుంది టీటీడీ.
తిరుపతి బస్టాండ్ కిటకిట, అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
ఇక దీంతో అటు తిరుమలలో ఉన్న భక్తులు, ఇటు తిరుమలకు వెళుతున్న భక్తులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇవ్వడంతో తిరుపతిలోని బస్టాండ్ కు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. బస్సులు ఎక్కేందుకు పోటీపడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బస్సులు పెంచటం కోసం టీటీడీ కసరత్తు చేస్తోంది. వాహనాలతో వెళ్ళేవారు అలిపిరి కేంద్రం గుండా వెళుతున్నారు. దీంతో తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
తిరుమలలో లక్షమందికి పైగా భక్తులు.. గందరగోళంగా పరిస్థితి
గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకొని ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే గత మూడు రోజుల నుంచి సర్వ దర్శనం టిక్కెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఉన్నట్లుగా సమాచారం. తిరుపతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా టోకెన్ల కోసం భక్తుల మధ్య తొక్కిసలాట జరగడం, ఎన్నడూ చూడని విధంగా భక్తులు కిటకిటలాడటం, అందుకు తగిన ఏర్పాట్లు టీటీడీ చేయకపోవడంతో టిటిడి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా తిరుమలలో తాజా పరిస్థితులు అక్కడికి వెళ్ళిన భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.