నేటి నుండి శ్రీవారి దర్శనంతో తిరుమలకు కొత్త కళ .. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల సందడి ఇలా !!
ఎప్పుడెప్పుడా అని ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి దర్శనానికి వేళయింది. కరోనా లాక్డౌన్ ఎఫెక్టుతో సుదీర్ఘ విరామం తరువాత నేటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు టీటీడీ ఉద్యోగులు మరియు స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన టిటిడి చిన్నచిన్న లోటుపాట్లను గుర్తించి, వాటిని కూడా సవరించి భక్తులకు ఆరోగ్యరక్షణతో కూడిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
Recommended Video
ఉచిత దర్శన టోకెన్ లకు ప్రజల నుండి విశేషమైన స్పందన
ఇక ఈ నేపథ్యంలో తిరుపతిలోని మూడు ప్రాంతాలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ ల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది టీటీడీ. ఇక ఈ ఉచిత దర్శన టోకెన్ లకు ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తోంది. రోజుకు మూడువేలు చొప్పున మాత్రమే టోకెన్లు ఇవ్వాలని మొదట టీటీడీ నిర్ణయించినప్పటికీ,భక్తుల రద్దీ నేపద్యంలో 750 టోకెన్లను పెంచి మొత్తం 3750 చొప్పున టోకెన్లు ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఈనెల 14వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు . భక్తుల రద్దీతో ఈనెల 17వ తేదీ వరకు టోకెన్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.
శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి భక్తుల రాక .. అప్రమత్తంగా సిబ్బంది
ఇక నేటి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు రానున్న నేపథ్యంలో, మరోపక్క కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు టిటిడి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.అలిపిరిలో థర్మల్ స్క్రీనింగ్ , శానిటైజ్ చేసిన తర్వాత టికెట్లు ఉన్నవారినే తిరుమలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుమలకు వచ్చేవారిలో రోజుకు 200మంది నుంచి ర్యాండమ్గా శాంపిల్స్ తీసుకుని కరోనా పరీక్షలు చేయనున్నారు.
దర్శనాలకు టైమింగ్స్ నిర్ణయించిన టీటీడీ .. కళకళలాడనున్న తిరుమల
భక్తుల మధ్య భౌతిక దూరాన్ని అమలుచేస్తూ రోజూ ఉదయం 6.30నుంచి సాయంత్రం 7.30గంటల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో ఉదయం స్వామి దర్శన ప్రారంభంలో గంట సేపు వీఐపీలకు కేటాయించనున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఆ ఏడుకొండల వాడి దర్శనం కోసం ఎదురు చూసిన భక్తుల కోరిక తీరింది. వెంకన్న దర్శనం భక్తజనానికి నేటినుండి సాక్షాత్కరించనుంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ తో భక్తులు లేక వెలవెల బోయిన తిరుమల కొండ నేటి నుండి కళకళలాడనుంది.
కరోనా నేపధ్యంలో కఠిన నిబంధనలు .. వారు రావద్దని విజ్ఞప్తి
అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం,మాస్కులు ధరించడం వంటి నిబంధనలను పక్కాగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పూర్తయిందని, ఆన్లైన్లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక కంటైన్మెంట్ జోన్ , రెడ్ జోన్ల ప్రజలు దర్శనాలకు రావద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు . భక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే క్వారంటైన్కు పంపుతామని టీటీడీ అధికారులు చెప్తున్నారు .