తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై తీపి కబురు!
కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు కొలువైన తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలకు అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. సెప్టెంబర్ 24నుండి అక్టోబర్ 2వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో జె. శ్యామలారావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజులతో పాటు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.
సెప్టెంబర్ 24న స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకురానున్న చంద్రబాబు
ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి జరిగే కార్యక్రమాలను, వాటిని ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24వ తేదీన బ్రహ్మోత్సవాలు తొలి రోజు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28వతేదీన స్వామివారికి గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహిస్తారని తెలిపారు.

వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలపై ఆదేశాలు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని టిటిడి ఈవో ఆదేశాలు జారీ చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.ఆలయానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో కూడా తగు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ అంశాలపై దృష్టి పెట్టాలన్న ఈవో
ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు తదితరాలపై చర్చించారు.
అన్ని అంశాలపై సమగ్ర చర్చ
కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా & సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ మరియు ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ చర్చలో అనేక సూచనలను ఇచ్చిన ఈవో ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications