టీడీపీకి మళ్లీ 23 గండం: క్లైమాక్స్కు పార్టీ కథ : విజయాలను మరిచిపోయి..చివరికి ఓట్ల శాతం పార్టీగా..!
తెలుగుదేశం పార్టీ... ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన శక్తిగా గుర్తింపు ఉంది. తెలుగోడి సత్తా ఢిల్లీలో చాటాలని భావించి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. పార్టీ స్థాపించిన 9 నెలలకే అఖండ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పార్టీని మరో లెవెల్కు తీసుకెళ్లారు. 2014లో టీడీపీకి ఓటమి తప్పదు అని అనుకుంటున్న తరుణంలో కూడా పసుపు పార్టీని విజయతీరాలకు చేర్చారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి గండం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఆకాశంలో చుక్కల్లా మిలమిలా మెరిసిన పార్టీ ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. 2019 నుంచి ఏ ప్రధాన ఎన్నికలు జరిగినా పార్టీకి ఓటమి అనేది షరా మామూలైపోయింది. తాజాగా తిరుపతి ఉపఎన్నికలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ టీడీపీని వణికిస్తున్నదేంటి..? ఆ గండం ఏంటి..?
కలిసిరాని 23 సంఖ్య
తెలుగుదేశం పార్టీ... ఈ పేరు చెప్పగానే ఇప్పుడు గుర్తుకొచ్చేది మాత్రం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీని క్రమశిక్షణలో పెట్టడం చంద్రబాబుకు మించిన వారు లేరనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే 2019 ఎన్నికల తర్వాత పార్టీ గతే మారిపోయింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక్కడ 23 సంఖ్య ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు.
అవును వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా 2014 నుంచి 2019 వరకు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత అవే 23 స్థానాలు టీడీపీకి దక్కాయి. ఇదే వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. ఇక సీన్ కట్ చేస్తే 23వ సంఖ్యకు టీడీపీకి ఏదో బలమైన సంబంధం ఉందని పలు వరుస ఘటనలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తిరుపతి ఉపఎన్నికలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే చెబుతున్నాయి.
తిరుపతి ఉపపోరులో కూడా 23 సంఖ్య
తిరుపతి ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలవగా.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో నిలిచారు. ఇక ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు-లోకేష్లు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగి ప్రచారం చేశారు. వైసీపీపై విమర్శలు సంధించారు.
అంతేకాదు యువతను ఆకట్టుకునేందుకు తిరుపతి పార్లమెంటు పరిధిలో యువనాయకులు సైతం ప్రచారం చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరాం, కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, ఇలా పలువురు యువనేతలు ప్రచారం చేశారు. ఎంతమంది ప్రచారం చేసినప్పటికీ అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తిరుపతి ఉపఎన్నికలో ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీకి 23 శాతం ఓటు షేరు దక్కుతుందని జోస్యం చెప్పింది. ఇక్కడ కూడా 23 సంఖ్య కనిపించడంతో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులకు నేతలకు ఇదొక హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video
23వ తేదీనే ధూళిపాళ్ల అరెస్టు
తిరుపతి ఉపఎన్నిక కోసం పార్టీని గెలిపించే బాధ్యత ఆ నియోజకవర్గపు మంత్రులు, ఎమ్మెల్యేలపై పెట్టారు సీఎం జగన్. తను కూడా ప్రచారంకు వస్తానని కూడా మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ.. చివరి నిమిషంలో కోవిడ్ కారణంగా ప్రచారం రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ జగన్ కూడా ప్రచారంకు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు మాత్రం సీఎం జగన్ ప్రచారం చేయకపోవడమే కలిసొచ్చిందని చర్చించుకుంటున్నారు. ఒకవేళ సీఎం జగన్ ప్రచారం చేసి ఉంటే టీడీపీ అన్లక్కీ నెంబర్ 23 శాతం కాస్త మరింత దిగజారేదని సెటైర్లు వేస్తున్నారు.
ఇక 23 సంఖ్య అంటేనే టీడీపీ నేతల్లో గుబులు పుడుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 23వ తేదీనే సీఐడీ విచారణకు రావాలంటూ టీడీపీ అధినేతకు పిలుపు వెళ్లింది. అయితే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఆ కథ ముగిసింది. ఇక ఏప్రిల్ 23వ తేదీనే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు జరిగింది. ఇక మే 23వ తేదీ ఎవరి వంతు ఉంటుందో అని టీడీపీలోనే జోరుగా చర్చ జరుగుతోంది.
మొత్తానికి 23 సంఖ్య టీడీపీని కలవరపెడుతోందంటూ ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో ఘనచరిత్ర కలిగి ఉన్న టీడీపీ నేడు 23వ సంఖ్య అంటేనే జంకుతోందని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ రచ్చ మామూలుగా లేదు. వైసీపీ అభిమానులు టీడీపీపై వేస్తున్న సెటైర్లు పీక్ స్టేజెస్కు చేరుకున్నాయి.