Tirupati రుయా మృతుల సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు: కోర్టును ఆశ్రయిస్తాం: అంతా ఐదునిమిషాల్లోనే..!
తిరుపతి: రుయా హాస్పిటలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులు స్పందించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంతా చూస్తుండగానే తమ వారు ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటూ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి వరకు బాగానే ఉన్న తమవారు కోలుకుని త్వరగా తిరిగి వస్తామని మాట్లాడినవారు... ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఆక్సిజన్ నిల్వ ఉండేలా ముందే చూసుకోవాలని చెప్పిన మృతుల కుటుంబ సభ్యులు... ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే అని మండిపడ్డారు.
తిరుపతి రుయా హాస్పిటల్లో అదనపు సిలిండర్లు ఉన్నప్పటికీ సకాలంలో తీసుకురాలేదని దీంతో తమ వారు శ్వాస అందక మృతి చెందారని మరికొందరు భోరున విలపించారు. హాస్పిటల్ సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కన్నీటిపర్యంతమయ్యారు.
కొన్ని నిమిషాల వ్యవధిలో అంతమంది చనిపోవడం మామూలు విషయం కాదని కచ్చితంగా ఈ ఘటనపై విచారణ జరిపాలని డిమాండ్ చేసిన మృతుల బంధువులు... దీనిపై కోర్టును ఆశ్రయించడమే కాకుండా మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతామని మరొక మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక మృతుల సంఖ్య ఒకలా ఉంటే ప్రభుత్వం చెప్పే సంఖ్య మరోలా ఉందని రెండిటికీ పొంతన లేదని మరికొందరు ఆరోపించారు.
#BreakingNews: Disturbing news emerging out of #Tirupati #RUIA Hospital. 13 patients critical after disruption in oxygen supply. Unconfirmed reports say over 10 dead. A patient inside gives an account in these 2 videos . Viewer discretion advised. #AndhraPradesh pic.twitter.com/Cfj0UXcerL
— krishnamurthy (@krishna0302) May 10, 2021
Recommended Video
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే అక్కడికి పలువురు అధికారులు చేరుకుని ఆక్సిజన్ పరిస్థితిని సమీక్షించారు. ఇక తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. రుయా ఆస్పత్రి వద్ద ఆందోళన తెలిపేందుకు బయలుదేరిన నారాయణను పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు. ఆయన్ను తిరుపతి వద్ద సొంతగ్రామంకు తరలించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయా ఆస్పత్రిలో అంతమంది మరణించారని ప్రభుత్వమే బాధ్యత వహించాలని నారాయణ అన్నారు.