తిరుమలలో ఉగ్రవాదుల సంచారమంటూ మెయిల్: హైఅలర్ట్ లేదన్న ఎస్పీ
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి వచ్చిన మెయిల్ కలకలం రేపింది. అయితే, అది కొందరు ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో అప్రమత్తమై వివరాలు పరిశీలించామని.. అంతా బూటకమని తేలిందని ఎస్పీ చెప్పారు. ఇది ఆకతాయిల్ మెయిల్గా భావిస్తున్నామని తెలిపారు. మెయిల్ విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుమలలో ఎలాంటి హైఅలర్ట్ లేదని చెప్పారు.

భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. కాగా, దుండగుల మెయిల్ నేపథ్యంలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ తిరుమలలో తనిఖీలు చేపట్టారు. మెయిల్ ఎక్కడి నుంచి పంపించారు? ఎవరు పంపించారు? అనే కోణాల్లో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేశారు.
ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు.
ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రసరమ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications