కొందరికి ఎముకలు విరిగాయి.. మరికొందరు నలిగిపోయారు: స్విమ్స్ డైరెక్టర్ రిపోర్ట్
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 40 మంది వరకు గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ తొక్కిసలాటలో మొత్తం ఆరు మంది మృతిచెందారు. అధికారులు వారిని గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా వారి వివరాలను సేకరించారు. మృతుల్లో ఇద్దరు పొరుగు రాష్ట్రాలకు చెందన వాళ్లుగా గుర్తించారు.
మృతుల్లో.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బీ నాయుడు బాబు (51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34) ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందారు. జిల్లా పోలీసు అధికారులు వాళ్ల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
స్విమ్స్లో చికిత్స పొందుతున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను స్విమ్స్- శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. వారికి అందిస్తోన్న వైద్య చికిత్స గురించి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. గాయపడ్డ వారిలో మొత్తం 19 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
తొక్కిసలాటలో గాయపడ్డ వారిలో కొందరు పేషెంట్లకు ఫ్రాక్చర్ అయిందని స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. మరికొందరు నలిగిపోయారని, వాళ్ల కండరాలు/స్కిన్ గాయాలయ్యాయని వివరించారు. స్విమ్స్లో మొత్తం 19 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ వారు ఈ సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించడానికి రానున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications