300 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీవారి లడ్డూ
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ప్రసాదం లడ్డూకు ఉన్న ప్రత్యేకతే వేరు. పేరు వింటేనే ఆశగా చూసే ఈ లడ్డూ తయారీ మొదలై 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా లడ్డూలను నివేదించడం ఆగస్టు 2, 1715 నుంచి ప్రారంభమైనట్టు ఆలయ అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన హిందూ దేవాలయంగా పేరుగాంచిన తిరుమల ఆలయ ప్రసాదం లడ్డూకు ఏదీ సాటిరాదంటే అతిశయోక్తి కాదు. ఈ లడ్డూ తయారీలో శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష తదితర ఎన్నో పదార్థాలను కలిపి తయారు చేస్తారు.
శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.
2014-15లో ప్రసాదాల విక్రయం వల్ల టీటీడీకి రూ. 2,401 కోట్ల ఆదాయం లభించింది. లడ్డూ తయారీ కేంద్రంలో 270 మంది వంటవారు సహా మొత్తం 620 మంది పని చేస్తుంటారు. ఇక్కడ రోజుకు 8 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తుంటారు.
శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డూతో పాటు వివిధ రకాలైన నైవేద్యాలను తయారు చేస్తుంటారు. వీటిలో ముఖ్యమైనవి వడలు, దోశలు, పులిహోర, పరమాన్నం, దద్దోజనం, జిలేబీ. టీటీడీ లెక్కల ప్రకారం 2014లో 22.6 మిలియన్ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 831 కోట్ల ఆదాయం వచ్చింది.