తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!
తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరో నెలరోజుల్లో తిరుపతి నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ మధ్య విమాన సర్వీసులు ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం మలేషియా నుంచి వచ్చిన స్కైలెట్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. తామే సొంతంగా ఈ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణతో కలిసి వారు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ సురేష్తో భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనలను వారు ఆయన ముందు ఉంచారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని సురేష్ వారికి వివరించారు. మలేషియాలో ఉన్న ప్రవాస భారతీయులు నేరుగా తిరుపతికి చేరుకోవడానికి ఈ విమాన సర్వీసులు ఉపయోగపడతాయని సురేష్ తెలిపారు.
ప్రస్తుతం మలేషియా నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి రావాలంటే ముందుగా చెన్నై లేదా తిరుచ్చిలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా తిరుమలకు వస్తున్నారు. మలేషియా-చెన్నై మధ్య ప్రస్తుతం రోజూ 10 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో కనీసం 60 శాత మంది తిరుమలకు వచ్చే వారే. తిరుపతి- కౌలాలంపూర్ మధ్య ప్రయాణికుల తాకిడి ఆశించిన స్థాయిలో ఉండటం వల్ల ఈ రెండు నగరాల మధ్య విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకుని వస్తే.. లాభదాయకంగా ఉంటుందని స్కైలెట్ లాజిస్టిక్స్ ప్రతినిధులు తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయాన్ని తీసుకుంటామని సురేష్ వారికి హామీ ఇచ్చారు.