అంతా ఆరెస్సెస్, రిజైన్ చేస్తా: రాయపాటి, మౌనంవద్దు.. అతివద్దు: బాబు, 'బీజేపీ క్షమించరాని తప్పు'
అమరావతి/న్యూఢిల్లీ: బడ్జెట్ విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, ఇతర నేతలు బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎంపీ రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బడ్జెట్ దారుణం, అందుకే బీజేపీ ఓడింది: మోడీకి బాబు దెబ్బ, 'అమిత్ షా మాటల్లో ధైర్యం'
బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని రాయపాటి అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం తాను తన నిర్ణయన్ని ప్రకటిస్తానని చెప్పారు.
బీజేపీతో తెంచుకుందామా?: అడగనున్న బాబు, 'కేంద్రం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు'
కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువుండేది, ఇక్కడ అంతా ఆరెస్సెస్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని రాయపాటి అన్నారు. కానీ బీజేపీలో మాత్రం ఆరెస్సెస్ ఏదీ చెబితే అదేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ చెప్పేదే చేసే పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని చెప్పారు.
రాజీనామా చేస్తాం, ఎల్లుండి మిగతా ఎంపీలది
ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని రాయపాటి హెచ్చరించారు. బీజేపీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని చెప్పారు. చంద్రబాబు చెబితే తాను రాజీనామా చేస్తానని, మిగతా ఎంపీల విషయం ఎల్లుండి అంటే ఆదివారం తేలుతుందని చెప్పారు.
టీడీపీని ఇబ్బంది పెట్టి పైకి రావాలనుకుంటున్న బీజేపీ
టీడీపీని ఇబ్బంది పెట్టి ఏపీలో పైకి రావాలని బీజేపీ కోరుకుంటోందని రాయపాటి అన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు.
క్షమించరాని తప్పు, తలుపులు తీసి బీజేపీ అన్యాయం.. మోదుగుల
బీజేపీ ఏపీని విస్మరించి క్షమించరాని తప్పు చేస్తోందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో వెంటనే మార్పులు చేసి ఏపీకి కేటాయింపులు పెంచాలన్నారు. ఈ సమయంలో ఎంపీగా లేనందున తనకు చాలా బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాడు పార్లమెంటు తలుపులు మూసేసి అన్యాయం చేస్తే బీజేపీ తలుపులు తీసి అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బడ్జెట్పై మౌనం వద్దు, అతి వద్దు
టీడీపీ నేతలతో జరిగిన భేటీలో చంద్రబాబు నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్పై మనం సైలెంటుగా ఉంటే ప్రమాదకరమని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేంద్రం తీరుపై పోరాటం కొనసాగిద్దామని చెప్పారు. అళా అని అతిగా కూడా స్పందించవద్దని హితవు పలికారు. అలా చేస్తే జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతుందన్నారు. మిత్ర ధర్మాన్ని బ్యాలెన్స్ చేసుకొని పోరాటం సాగిద్దామన్నారు.