YS Jagan: బలంగా పోరాడుతాం, రైతులకు న్యాయం చేస్తాం
కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీతో పాటు జీఎస్టీ పెంపు నిర్ణయాల వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన రైతులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి(YS JAgan Mohan Reddy) ని కలిసి తమ సమస్యలను వివరించారు.
పన్నుల భారంతో పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగడంతో మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా పొగాకు కొనుగోళ్లు తగ్గి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించక జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతూ, కేంద్ర ప్రభుత్వం పన్నుల తగ్గింపుపై పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తమ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని కూడా వైయస్ జగన్కు అందజేశారు.

YS Jagan హామీ..
ఈ సందర్భంగా స్పందించిన వైయస్ జగన్.. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తి, రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో చింతలపూడి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కంభం విజయరాజు, ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, కార్యదర్శి సత్యనారాయణతో పాటు రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు జెట్టి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications