అందరిలోనూ పోలవరం ఫీవర్: కేంద్రం తనిఖీల పర్వం.. ఏపీ వివరణల మయం
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయిని గోదావరి నదిపై నిర్మిస్తున్న 'పోలవరం' ప్రాజెక్టు. మూడున్నరేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటు కోసం ఏపీకి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ చేర్చింది. తర్వాత ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా మిత్రపక్షాలు కావడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వానికే అప్పగించింది కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్. కానీ సమయం ఆగదుగా.. మూడేళ్లు అలా కాలగర్భంలో కలిసిపోయాయి.
అసలే రాజధాని 'అమరావతి' నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుని అపకీర్తిని మూట గట్టుకున్నది ఏపీ సర్కార్. మరోవైపు తాత్కాలిక ఏర్పాట్ల పేరిట పట్టిసీమ, పురుషోత్తమ లిఫ్ట్ పథకాల ద్వారా క్రుష్ణా డెల్టాతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు నీటిని తరలించేందుకు రమారమీ రూ.3000 కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది.
టెండర్లు నిలిపేయాలని కేంద్రం ఆదేశించడంతో సమస్య మొదలు
ఇంత జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిందని, పునరావాసానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని అంచనాలను రూ.53 వేల కోట్లకు పెంచడంతో అసలు కొర్రీ వచ్చి పడింది. అసలు ఇప్పటివరకు కేటాయించిన నిధులపై లెక్కలు పంపమని కేంద్రం ఆదేశిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి.. వచ్చే ఏడాది నీటిని మళ్లించి.. ఆంధ్రుల మనస్సులు తనకు అనుకూలంగా మళ్లించుకోవాలని.. తద్వారా ప్రజాతీర్పు మరోసారి పొందాలన్న దూరాలోచన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నదన్నసంగతి ప్రతి ఒక్కరికీ అర్థమైంది. దీంతో కాఫర్ డ్యామ్ నిర్మాణం, స్పిల్ వే నిర్మాణ పనులకు పిలిచిన టెండర్లను నిలిపేయాలని కేంద్రం హుకుం జారీ చేయడంతో.. కేంద్రం తీసుకుంటామంటే నమస్కారం పెట్టి అప్పగిస్తామన్న చంద్రబాబు.. తర్వాత మెత్తబడ్డారు. తెర వెనుక లాబీయింగ్తో పనులు సాకారం చేసుకోవాలని ఎత్తు వేశారు. తదనుగుణంగా సంప్రదింపులు సాగిస్తున్నారు. ఈ హడావుడి మధ్య కేంద్రం నుంచి ఒకరి తర్వాత మరొక నిపుణుడు వచ్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని సమీక్షిస్తూనే ఉన్నారు.
పునరావాసం, భూసేకరణ పనులను పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ
మరొకవైపు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి పనులు వేగిర పరుస్తున్నది. ఇంకొకవైపు పోలవరం ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించడానికి ముందే ఇక్కడి పనులు, ఇతరత్రా సమస్యలకు పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర ద్రుష్టి సారించిన కేంద్ర జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేస్తోంది. డిసెంబర్ నెలాఖరులోనే ప్రాజెక్టు సందర్శనకు వస్తానని, ఇకనుంచి నెలనెలా ఇక్కడికి వస్తానని, గడువులోపు ఎలా పూర్తి చేయాలో తనకు తెలుసునని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కింద పునరావాసం, భూసేకరణ అంశాలను కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్డ్యాంను జాతీయ జల విద్యుత్ పరిశోధన కార్పొరేషన్ నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టులో అదనపు బాధ్యతలు స్వీకరించిన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హల్దర్ గురువారం ప్రాజెక్టును పరిశీలించారు.
జనవరికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన వాయిదా?
కేంద్ర జల వనరుల మంత్రి సాంకేతిక సలహాదారు సంజయ్ కోలాపుర్కర్ శనివారం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారు. ఇప్పటికే ఆయన పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును దేశ రాజధాని ఢిల్లీకి పిలిపించి చర్చించారు. తొలుత ఆయన విజయవాడకు వచ్చి పోలవరం అథారిటీ, పోలవరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షిస్తారు. త్వరలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సింగ్ సైతం ఇక్కడికి వస్తారని సమాచారం. వీరి నివేదికల ప్రాతిపదికగా కేంద్ర మంత్రి గడ్కరీ అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పర్యటన జనవరి మొదటి వారానికి వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర అధికారుల నుంచి వర్తమానం అందింది. ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు మినహా మిగిలిన పనులన్నీ వేగంగా సాగుతున్నాయని అథారిటీ సీఈవో హల్దర్ చెప్పినట్లు సమాచారం. శుక్రవారం హల్దర్, కార్యదర్శి గుప్తా ఈఎన్సీ, కార్యదర్శులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
రెండు బ్యాచింగ్ ప్లాంట్ల అనుసంధానంతో ఇలా నిర్మాణం
పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల్లో అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ముఖ్యమైనది. ఉష్ణోగ్రతలకు తగ్గట్టు కాంక్రీట్ పని చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ ప్లాంటు దాదాపు సిద్ధమైంది. ఒక బ్యాచింగ్ ప్లాంటుతో దీన్ని అనుసంధానించారు. శనివారం ఏ సమయంలోనైనా ఈ ప్లాంటు సాయంతో కాంక్రీటు పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు బ్యాచింగ్ ప్లాంట్లకు అనుసంధానిస్తే రోజుకు ఐదువేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటు పనులు చేయవచ్చని చెబుతున్నారు. జూన్ నాటికి స్పిల్వే పనులు పూర్తి కావాలంటే రోజుకు 8000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంటుంది. గోదావరికి వరదలు వచ్చేలోగానే పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఎస్కే హల్దర్ సూచించారు.
నెలాఖరులోగా నీటి వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ సందర్శన
ప్రాజెక్టు వద్ద గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ హల్దర్ శుక్రవారం అంతా విజయవాడలో ప్రాజెక్టు పనులపై ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావుతో పనులపై సమీక్షించారు. సాయంత్రం సచివాలయంలో జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా కూడా ఉన్నారు. 2019లో సంపూర్ణంగా పూర్తి చేయాలనే మరో సంస్థకు పనులు అప్పగిస్తున్నామని హల్దర్కు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించింది. ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధుల వినియోగ పత్రాల (యూసీలు)తో పాటు బిల్లులు కూడా తమకు నేరుగా పంపుతున్నారని, వీటి పరిశీలన తమకు బాగా కష్టమవుతోందని చెప్పారు. ఇక యూసీలు పంపితే చాలని సూచించారు. శనివారం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఓఎస్డీ సంజయ్ ఖోలాపుర్కర్తో కలసి మరోసారి పోలవరం ప్రాజెక్టు పనులు సమీక్షిస్తారు. ఈ నెలాఖరులో జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ లోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమగ్ర నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ హల్దర్, కేంద్ర జల వనరుల మంత్రి సాంకేతిక సలహాదారు ఖోలాపుర్కర్ రూపొందిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తూనే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.