Singer Mangli: జగన్ పాటతో అవకాశాలు కోల్పోయా, చంద్రబాబు గ్రేట్-సింగర్ మంగ్లీ షాకింగ్..!
టాలీవుడ్ సింగర్ మంగ్లీ తాజాగా ఏపీలో మరోసారి వార్తల్లోకి వచ్చారు. దీనికి ప్రధాన కారణం కేంద్రమంత్రి, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి అరసవిల్లి సూర్యదేవాలయానికి దర్శనానికి వెళ్లడమే. వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న మంగ్లీని ఇలా తమ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లి దేవాలయానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. వెంటనే సోషల్ మీడియాలో విమర్శలకు దిగాయి.
దీనిపై అటు రామ్మోహన్ నాయుడు కానీ, సింగర్ మంగ్లీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఈ విమర్శల జడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ ఇవాళ స్పందించారు. ఈ మేరకు ఏపీలో రాజకీయ పార్టీలతో తన సంబంధాలపై బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆమె తాజా పరిణామాల్ని సైతం ప్రస్తావించారు. తద్వారా రాజకీయ పార్టీలతో తన ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయో తేల్చేశారు.

దేవుడి కార్యక్రమానికి వెళ్తే తనపై నిందలేయడం అన్యాయమంటూ ఇవాళ మంగ్లీ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆమె.. 2019 ఎన్నికలకు ముందు తనను కొందరు సంప్రదిస్తే వైసీపీకి పాట పాడినట్లు తెలిపారు. అయినా ఇతర పార్టీలకు చెందిన నాయకుల్ని తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. వైసీపీతో పాటు ఇతర పార్టీల నాయకులకు కూడా తాను పాటలు పాడానని, అయినా వైసీపీకి పాడిన పాట వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని, అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన పాట ప్రతీ ఇంట్లో పండగ కావాలి కానీ పార్టీల పాట కాకూడదనేది తన అభిప్రాయం అన్నారు.
గత ఎన్నికల్లో తాను ఏ పార్టీకి పాడలేదని మంగ్లీ గుర్తుచేశారు. చంద్రబాబు కోసం పాట పాడనని ఎప్పుడూ చెప్పలేదని, రాజకీయ లబ్ది కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్ధానం ఉన్న వ్యక్తి ఆయన అన్నారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవని మంగ్లీ తెలిపారు. తాను ఏ పార్టీకి ప్రచార కార్యకర్తను కానన్నారు. కళాకారిణిగా తనకు పాటే ముఖ్యమని, కాబట్టి తన పాటకు రాజకీయ రంగులు పులమొద్దని కోరారు. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications